కొండంత ఆశ.. టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచులో నిరాశపర్చిన టీమిండియా!

by saikumar |
కొండంత ఆశ.. టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచులో నిరాశపర్చిన టీమిండియా!
X

దిశ, స్పోర్ట్స్ : మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ తొలి లీగ్ మ్యాచులో భార‌త మహిళల జట్టుకు ఊహించ‌ని షాక్‌ తగిలింది. రెండు నెలల పాటు అంతర్జాతీయ మ్యాచులకు దూరంగా ఉన్న టీమిండియా కేవలం 10 రోజుల పాటు ప్రత్యేక క్యాంప్‌లో సాధన చేసి యూఏఈ వెళ్లింది. తొలుత రెండు వార్మప్ మ్యాచుల్లో రాణించిన టీమిండియా.. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచులో బ్యాట‌ర్ల స‌మిష్ఠి వైఫ‌ల్యంతో భారీ ఓటమిని మూట‌గ‌ట్టుకుంది. ఎన్నో ఆశ‌ల‌తో ప్రపంచ కప్ వేటను ప్రారంభించిన హ‌ర్మన్‌ప్రీత్ కౌర్ బృందానికి న్యూజిలాండ్ బిగ్ షాకిచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 58 ప‌రుగుల తేడాతో భారత్ పరాజయాన్ని మూట‌గ‌ట్టుకుంది. ఈ మ్యాచుతో కివీస్ 2 పాయింట్లతో పాటు మంచి ర‌న్‌రేటును సాధించింది.

ఓపెనర్లు ఫెయిల్..

తొలుత టాస్ ఓడి బౌలింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 160/4 పరుగులకు న్యూజిలాండ్ జట్టును కట్టడిచేసింది. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభం నుంచే నిరాశ పర్చింది. ఓవర్‌కు ఎనిమిది పరుగులకు పైగా ర‌న్‌రేటు కావాల్సి ఉండగా.. భారత ఓపెన‌ర్ ష‌ఫాలీ వ‌ర్మ (2)ను ఈడెన్ కార్సన్ ఔట్ చేసింది. 11 ప‌రుగుల‌కే తొలి వికెట్ ప‌డగా.. మ‌రో ఓపెన‌ర్ స్మృతి మంధాన‌ (12), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (15)లు ఆచితూచి ఆడటం ప్రారంభించారు. ఆ తర్వాత కాసేపటికే మంధాన ఔట్ అవ్వడంతో ర‌న్‌రేటు అమాంతం పెరిగిపోయింది. దీంతో ఒత్తిడికి లోనై భారీ షాట్లకు యత్నించిన కెప్టెన్ హ‌ర్మన్‌ప్రీత్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. దీంతో టీమిండియా గెలుపు భారం మిడిలార్డర్‌పై పడింది. చూస్తుండగానే జెమీమా రోడ్రిగ్స్(13), రీచా ఘోష్‌ (12), అరుంధ‌తి రెడ్డి(1)లు కూడా తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో భార‌త్ ఓట‌మి దాదాపుగా ఖాయ‌మైంది. టెయిలెండర్లు కూడా చేతులెత్తేయడంతో కివీస్ 58 ప‌రుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, భారత టాపార్డర్, మిడిలార్డర్‌ను కూల్చడంలో న్యూజిలాండ్ బౌల‌ర్ రొస్‌మెరీ మెయిర్(4/19) సక్సెస్ అయ్యిందని చెప్పుకోవచ్చు.

సోఫీ స్టన్నింగ్ ఇన్నింగ్స్..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు తొలుత ఆచితూచి ఆడగా, చివరి ఓవర్లలో భారీ స్కోర్ రాబట్టింది. కెప్టెన్ సోఫీ డెవినె (57 నాటౌట్) స్టన్నింగ్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయింది. జట్టు ఓపెన‌ర్లు సుజీ బేట్స్ (27), జార్జియా ప్లిమ్మర్ (34)లు మంచి ఆరంభం ఇవ్వగా.. మిడిల్, డెత్ ఓవ‌ర్లలో సోఫీ చెలరేగిపోయింది. టీమిండియా ఫీల్డింగ్ వైఫ‌ల్యం కూడా న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయడానికి ఒక కారణం అని చెప్పుకోవచ్చు. దీనిని సొమ్ము చేసుకున్న సోఫీ బ‌ల‌మైన షాట్లతో రెచ్చిపోయింది. బ్రూక్ హ‌ల్లిడే(16)తో కలిసి 4వ వికెట్‌కు 46 ప‌రుగుల కీల‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పింది. దీంతో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత ఓవ‌ర్లలో 160 ప‌రుగులు రాబట్టింది. ఇక న్యూజిలాండ్‌ బౌలర్లలో రోస్‌మేరీ మెయిర్‌ 4, లీ తహుహు 3 వికెట్లు తీసి భారత్‌ పతనాన్ని శాసించారు. ఈడెన్‌ గార్సన్‌ రెండు, అమేలియా ఒక వికెట్‌ తీశారు.

స్కోరు బోర్డు :

న్యూజిలాండ్ : 160/4 (20 ఓవర్లు)

బ్యాటింగ్ : సుజీ బేట్స్ 27 (సి) శ్రేయాంక పాటిల్ (బి) అరుంధతి రెడ్డి, జార్జియా ప్లిమ్మర్ 34 (సి)స్మృతి మంధాన (బి) శోభన, అమీలియా కేర్ 13 (సి) పూజా, (బి) రేణుక, సోఫీ డివైన్ 57 (నాటౌట్), బ్రూకీహాలీడే 16 (సి) స్మృతి మంధాన (బి) రేణుకా, మ్యాడీ గ్రీన్ 5 (నాటౌట్), ఎక్స్‌ట్రాలు : 8

వికెట్ల పతనం : 67/1,67/2,99/3,145/4,

బౌలింగ్ : పూజా వస్త్రాకర్ (1-0-9-0), రేణుకా సింగ్ (4-0-27-2), దీప్తి శర్మ (4-0-45-0), అరుంధతి రెడ్డి (4-0-28-1), అషా శోభన (4-0-22-1), శ్రేయాంక పాటిల్ (3-0-25-0)

భారత్ జట్టు : 102/ 10 (19 ఓవర్లు)

బ్యాటింగ్ : స్మృతి మంధాన 12 (సి) మ్యాడీ గ్రీన్ (బి) ఈడెన్ కార్సన్, షెఫాలీ వర్మ 2 (సి అండ్ బి) కార్సన్, హర్మన్ ప్రీత్ కౌర్ 15 (ఎల్బీడబ్ల్యూ ) రోస్ మెర్రీ, జెమ్మియా రోడ్రిగ్స్ 13 (సి) మ్యాడీ గ్రీన్ (బి) లియా రిచాగోష్ 12 (సి)సోఫీ డివైన్ (బి) లియా, దీప్తి శర్మ 13 (సి) సోఫీ (బి) లియా తహుహు, అరుంధతి రెడ్డి 1 (సి) సుజీ బేట్స్ (బి) రోస్ మెర్రీ, పూజా వస్త్రాకర్ 8 (బి) అమిలియా కేర్, శ్రేయాంక పాటిల్ 7 (సి అండ్ బి) రోస్ మెర్రీ, ఆషా శోభన 6 (నాటౌట్), రేణుకాసింగ్ 0 (సి) సోఫీ, (బి) రోస్‌మెర్రీ , ఎక్స్ ట్రాలు : 13

వికెట్ల పతనం: 11/1,28/2,42/3,55/4,70/5, 75/6,88/7,90/8,102/9,102/10

బౌలింగ్ : జెస్ కేర్ (3-0-13-0), ఈడెన్ కార్సన్ (4-0-34-2), రోస్ మెర్రీ (4-0-19-4), అమిలియా కేర్ (4-0-19-1), లియా తహుహు (4-0-15-3)

Advertisement

Next Story

Most Viewed