సరదాగా మొదలై... ఆ తర్వాత బానిసై జేబులు గుల్ల..

by Sumithra |
సరదాగా మొదలై... ఆ తర్వాత బానిసై జేబులు గుల్ల..
X

దిశ, తాడ్వాయి : సరదాగా మొదలై.. ఆ తర్వాత బానిసై జేబులు గుల్ల ఆపై పచ్చని కాపురాల్లో పేకాట చిచ్చు పెడుతోంది. వ్యసనానికి బానిసలైన ఎందరో నిలువ నీడను కూడా కోల్పోయి రోడ్డున పడుతున్నారు. ఉమ్మడి తాడ్వాయి మండలంలోని పలు గ్రామాల్లో పగలూ రాత్రీ తేడా లేకుండా యాదేచ్చగా పేకాట ఆడుతున్నారని ఉమ్మడి మండలంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆటలో ఓడినా వ్యక్తి డబ్బులు పోగొట్టుకున్న అక్కడే అప్పుగా బారు వడ్డీకో, చక్రవడ్డీకో ఇస్తుంటారని వినిపిస్తుంది. దీనికి తోడు గ్రామాలోని బెల్ట్ షాప్ ల్లో ఏ సమయంలో అయినా మద్యం అందుబాటులో ఉండడంతో ముక్క, చుక్కతో పేకాట రాయుళ్లకు ఆట బెల్ట్ షాప్ నిర్వాహకులకు ఆదాయ వనరులుగా మారుతుండగా, ఈ వ్యసనానికి బానిసలైన అనేక మంది ఆస్తులను పోగొట్టుకొని రోడ్డున పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

పేకాట పట్టణాల నుంచి పల్లెల్లోకి..

పెద్ద పెద్ద పట్టణాలు, నగరాలకే పరిమితమైన పేకాట.. అదే పత్తాలాట ఇప్పుడు మారుమూల గ్రామాలకు విస్తరించదంతో కుటుంబాలన్ని ఛిద్రమవుతున్నాయి. ధనవంతులు, రియల్​ ఎస్టేట్​, చీకటి వ్యాపారాలు బాగా సంపాదించిన వారు ఈ ఆటలో ఎంజాయ్​ చెయ్యడం చూశాం. కాని ఉమ్మడి తాడ్వాయి మండలంలో సాధారణ వ్యక్తులు సైతం పేకాట జోరుగా సాగిస్తున్నన్నట్లు తెలుస్తోంది. నిన్నమొన్నటి దాకా నాలుగైదు గ్రామాలకే పరిమితమైన పత్తాలాట ఐదారు గ్రామాలకు వ్యాపించినట్లు స్పష్టమవుతోంది. ఈ వ్యసనానికి బానిసలైన వ్యక్తులు అప్పుల పాలు కావడంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

ప్రత్యేక సెంట్రీ ఏర్పాటు..

పేకాట స్థావరాలకు ఇతరులు ఎవరైనా వస్తే ముందస్తుగా సమాచారం ఇవ్వడానికి కొందరు నిర్వాహకులు ప్రత్యేక సెంట్రీ వ్యవస్థను నిర్వహిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. పేకాట స్థావరాల చుట్టుపక్కల ప్రాంతాల్లో రహస్యంగా ఏర్పాటు చేసుకున్న సెంట్రీలు, పేకాట ఆడే ప్రదేశంలో అనుమానిత వ్యక్తుల పై నిరంతరం నిఘా ఉంచుతారు. పోలీసులు గానీ, అనుమానిత వ్యక్తులు గానీ సంచరించినట్లయితే వెంటనే నిర్వాహకులకు సమాచారం అందిస్తారు. దీంతో నిర్వాహకులు అప్రమత్తమై తప్పించుకోవడానికి వీలు కల్పించుకుంటున్నారు.

పేకాట వ్యసనానికి గురై ఇళ్లు గుళ్ల..

పేకాట రాయుళ్లు డబ్బులు పెట్టే స్థాయిని బట్టి గ్రూపులుగా విభజించి ఆట ఆడుతుంటారు. రూ. వెయ్యి నుంచి ప్రారంభించి రూ. 10 వేల వరకు ఆటలను నిర్వహిస్తున్నారు. పేకాట కారణంగా పలు కుటుంబాలను రోడ్డున పడుతున్నాయి. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తులు పేకాట వ్యసనానికి గురై ఇళ్లు గుళ్ల చేసుకుంటున్నారు. అసలే రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులు వ్యసనం బారిన పడి ఆర్థిక చిక్కులను కొనితెచ్చుకుంటున్నారు.ఏదేమైనా చట్టవిరుద్ధమైన పేకాట పై ఉక్కుపాదం మోపాలని, ఈ తతంగం నడిపిస్తున్న వ్యక్తులపై సంబంధిత అధికారులు దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

క్రిమినల్‌ కేసులు నమోదుచేస్తాం..తాడ్వాయి ఎస్సై వేంకటేశ్వర్లు

పేకాట రాయుళ్ళపై ప్రత్యేక దృష్టి పెట్టాం.పేకాట ఆడడంతో కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. మండలంలో పేకాట ఆడే వారు ఉంటే మానుకోవాలి. ఒకవేళ పేకాట ఆడినా,వాటిని ఆడించిన సంబంధిత వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకొని క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం.

Next Story

Most Viewed