Crime News : చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్

by Aamani |
Crime News : చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్
X

దిశ,మల్యాల: కొండగట్టు ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో జరిగిన చోరీ కేసును మల్యాల పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించిన వివరాలను డీఎస్పీ రఘు చందర్ వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బండారి స్వామి కరీంనగర్ వైపు నుండి జగిత్యాల వైపు వెళ్తుండగా ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో తన మోటార్ సైకిల్ ని రోడ్డు పక్కన ఆపి మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఆ సమయంలో అక్కడే చెట్ల పొదలలో మద్యం సేవిస్తున్న గుర్రం వెంకటేష్ రాజారాం గ్రామం, మల్యాల విష్ణువర్ధన్ మల్యాల గ్రామానికి చెందిన ఈ ఇద్దరు స్నేహితులు మద్యం కొనుగోలు చేయడానికి డబ్బులు లేకపోవడంతో దొంగతనం చేయడానికి నిర్ణయించుకున్నారు. అక్కడే ఆగి ఉన్న బండారి స్వామిపై కర్రలతో బెదిరించి మెడలో ఉన్న బంగారు చైను, చేతికి ఉన్న మూడు తులాల వెండి బ్రాస్లెట్ ,జేబులో ఉన్న రూ. 3500 నగదు , మొబైల్ ఫోన్ (ఐఫోన్ 14 ప్రో మాక్స్),మోటార్ సైకిల్ లాక్కొని వెళ్లారు.

వీటి విలువ దాదాపు రూ. ఒక లక్ష యాభై వేల వరకు ఉంటుందని ఫిర్యాదుదారుడు తెలిపి ఫిర్యాదు చేయడం జరిగింది. నిందితులు దొంగలించిన వస్తువులను గుర్రం వెంకటేష్ ఇంటికి రాజారం గ్రామానికి తీసుకుని వచ్చి భద్రపరిచినారు. తిరిగి మరల దొంగతనం చేయాలని ఇద్దరు కలిసి మాట్లాడుతుండగా వారిపై నిఘా పెట్టిన పోలీసులు అక్కడికి చేరుకుని వారిని పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి సేకరించిన వస్తువులను సీజ్ చేసి ఆదివారం కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు డీఎస్పీ రఘు చందర్ తెలిపారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశానుసారం డిఎస్పి రవి చందర్ సూచనల మేరకు మల్యాల సీఐ నీలం రవి ఆధ్వర్యంలో ఎస్సై నరేష్ కుమార్ తన సిబ్బంది అయిన రాజేందర్, సంతోష్ లతో ఈ కేసును ఛేదించినందుకు డీఎస్పీ అభినందనలు తెలిపారు.



Next Story