ఆస్తి కోసమే హత్య

by Sridhar Babu |
ఆస్తి కోసమే హత్య
X

దిశ, భిక్కనూరు : ఉన్న వ్యవసాయ భూమిని అమ్ముదామంటే సహకరించడం లేదన్న కోపం, ఎలాగైనా నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని దక్కించుకోవాలన్న కక్షను మనసులో పెట్టుకొని పక్కా ప్లాన్ ప్రకారం వదినను మరిది హతమార్చాడని సీఐ సంపత్ కుమార్ అన్నారు. మంగళవారం సాయంత్రం భిక్కనూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆస్తిని దక్కించుకోవడం కోసం మరిది మంద సురేష్ అలియాస్ యాకుబ్ ఐదు రోజుల క్రితం ఇంటి పక్కన గుడిసెలో బాసన్లు తోముకుంటున్న వదిన లావణ్య అలియాస్ యేసుమణిని వెనకాల నుంచి వచ్చి కత్తితో మెడపై పొడిచాడని తెలిపారు.

దీంతో భయపడిపోయిన ఆమె ప్రాణాలు కాపాడుకోవడం కోసం కేకలు పెడుతూ పరుగెత్తుకుంటూ బయట వాకిట్లోకి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన మరిది సురేష్ కత్తితో ఎక్కడపడితే అక్కడ పొడిచి వదినను హతమార్చాడని తెలిపారు. అంతకు ముందు అడ్డుకోబోయిన చుట్టుపక్కల వారిని తన వద్ద ఉన్న కత్తితో బెదిరించగా వారు భయంతో పక్కకు తప్పుకోగా, అన్న రాములు ను సైతం పక్కకు తోసేయడంతో కిందపడిపోయాడన్నారు. ఈ మేరకు మరిది సురేష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించినట్లు వివరించారు. ఈ సమావేశంలో ఎస్ఐ సాయి కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed