డీజిల్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్

by Disha Web Desk 15 |
డీజిల్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్
X

దిశ, శేరిలింగంపల్లి : కర్ణాటక నుండి డీజిల్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పట్టుకుని రూ.10 లక్షల విలువ చేసే 10800 లీటర్ల డీజిల్, రూ. 35 లక్షల విలువ చేసే 7 చిన్న డీజిల్ ట్యాంకర్లను సైబరాబాద్ ఎస్ ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి బుధవారం తెల్లవారుజామున ఎస్ ఓటీ మాదాపూర్ టీం, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా వీరిని పట్టుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లి శ్రీదేవి ఇంజినీర్ కళాశాల ముందుగల ఓపెన్ ప్లాట్ ను అడ్డాగా చేసుకుని కర్ణాటక నుండి అక్రమంగా తక్కువ ధరలకు డీజిల్ కొనుగోలు చేసి అక్కడి నుండి హైదరాబాద్ కు తరలించి నగరంలోని పలు పెట్రోల్ బంక్ లకు, అదే విధంగా ఆయా కంపెనీలకు డీజిల్​ అమ్ముతుండగా పట్టుకున్నారు. రాధాకృష్ణ అనే వ్యాపారస్తుడు కర్ణాటక నుండి తక్కువ ధరకు డీజిల్ కొనుగోలు

చేసి అక్కడి నుండి నగరానికి తీసుకువచ్చి ఇక్కడ అమ్మకాలు సాగిస్తున్నాడు. రాధాకృష్ణ చేస్తున్న స్మగ్లింగ్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఖజానాకు కోట్ల రూపాయల గండి పడుతున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక నుండి డీజిల్ కొనుగోలు చేస్తున్న స్మగ్లర్ రాధాకృష్ణ హైదరాబాద్ లో ఉన్న డోర్ స్టెప్ డెలివరీ సర్వీస్ నడుపుతున్న మరో స్మగ్లర్ సూర్య అలియాస్ సాయి రామ్ కు సప్లయి చేస్తున్నాడు. డోర్ స్టెప్ డెలివరీ సర్వీస్ యజమాని సాయిరామ్ తన మేనేజర్ అయిన రితేష్ ద్వారా చిన్న చిన్న టాంకర్లకు మార్చి స్థానికంగా ఉన్న ఇసుక లారీలకు, క్వారీ లారీలకు, డోర్ స్టెప్ డెలివరీ సర్వీస్ యాప్ ద్వారా సంప్రదించిన కన్జూమర్లకు అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

స్మగ్లర్ రాధాకృష్ణ ఒక్కరికే కాకుండా తెలంగాణలో ఇంకా చాలా మందికి సప్లయి చేస్తున్నట్లు తెలుస్తోంది. గత నెలలో కూడా ఇదే స్మగ్లర్ రాధాకృష్ణ ఇదే ప్లేస్ లో 18000 లీటర్స్ డీజిల్ అఫిషియల్ ట్యాంకర్ ద్వారా సప్లయి చేస్తూ సైబరాబాద్ ఎస్ ఓటీ చేతికి దొరికాడు. డీజిల్ స్మగ్లింగ్ కు సంబంధించి రాధాకృష్ణపై చాలా కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. రాధాకృష్ణ ఇప్పటికే గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో నమోదైన ఓ కేసులో పరారీలో ఉన్నాడు. ఈ ఘటనలో రూ.10 లక్షల విలువ చేసే 10800 లీటర్ల డీజిల్ ను, 7 చిన్న ట్యాంకర్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఏడుగురు డ్రైవర్లను అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed