బీమా రంగానికి డిమాండ్!

by  |
business
X

దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా సంక్షోభం కారణంగా అనేక సంస్థలు ఉద్యోగాలను తొలగిస్తున్న వేళ ఇన్సూరెన్స్ కంపెనీలు మాత్రం కొత్త నియామకాలు చేపడతామని ప్రకటిస్తున్నాయి. జూన్ నాటికి పలు ఇన్సూరెన్స్ కంపెనీలు సుమారు 5 వేల మందిని తీసుకుంటామని చెబుతున్నాయి. కరోనా భయమే కాకుండా భవిష్యత్తు బాగుకోసం ఇటీవల కాలంలో చాలామంది బీమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత డిమాండ్ ఊపందుకుంటాయనే ఆశలతో ఇన్సూరెన్స్ కంపెనీలు నైపుణ్యం ఉన్న వారికోసం వేట మొదలుపెట్టాయి. జూన్ త్రైమాసికంలో సుమారు 1500 మందిని నియమించుకోవాలని పీఎన్‌బీ మెట్‌లైఫ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇదే బాటలో కెనరా హెచ్ఎస్‌బీసీ ఓబీసీ లైఫ్ కంపెనీ సైతం 1000కి పైగా నియామకాలు చేపట్టాలని చూస్తోంది. టాటా ఏఐజీ గనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ 1000 మందిని, ఆ సంస్థ అనుబంధ జీవిత బీమా సంస్థ టాటా ఏఐఏ 500 మందిని జూన్ త్రైమాసికంలోపు నియమించాలని అనుకుంటున్నాయి. ఇక, రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ మే నెలలో 300 మందిని నియమించుకోగా, జూన్ నాటికి మరో 400 మందిని నియమించాలని ప్రయత్నిస్తోంది. రానున్న కాలంలో బీమా తీసుకునే వారు పెరిగే సంకేతాలు స్పష్టంగా ఉన్నందునే దానికి అనుగుణంగా నియామకాలు చేపడుతున్నట్టు టీమ్‌లీజ్ రిక్రూటింగ్ సర్వీసెస్ హెడ్ అజయ్ షా చెబుతున్నారు. అలాగే, లాక్‌డౌన్ తర్వాత ఆర్థిక వ్యవస్థలో వ్యాపార కార్యకలాపాలు పెరిగి, ఉద్యోగులకు జీతాలొచ్చే పరిస్థితులు ఏర్పడగానే బీమా ఉత్పత్తులపై ఆసక్తి చూపిస్తారని ఇన్సూరెన్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రజలకు ఆరోగ్యం విషయం శ్రద్ధ పెరగడం బీమా రంగానికి కలిసొచ్చే అంశమని వారు భావిస్తున్నారు.


Next Story

Most Viewed