పారాచూట్ విఫలం: గాజాలో ఐదుగురు మృతి

by samatah |
పారాచూట్ విఫలం: గాజాలో ఐదుగురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో గాజాలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడగా..అనేక మంది పౌరులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అక్కడి ప్రజలను ఆదుకునేందుకు పలు దేశాలు మానవతా సాయం అందిస్తున్నాయి. అయితే సాయం అందించే క్రమంలో విషాదం చోటు చేసుకుంది. ఉత్తర గాజాలోని శరణార్థుల శిబిరం వద్దకు పారాచూట్ ద్వారా ప్యాకేజీని పంపించగా.. అది తెరుచుకోకపోగా ఆహారం కోసం వేచి చూస్తున్న ప్రజలపై పడింది. దీంతో ఐదుగురు మృతి చెందగా..10 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆల్ షిఫా ఆస్పత్రికి తరలించినట్టు ఎమర్జెన్సీ రూమ్ హెడ్ నర్సు మహ్మద్ అల్-షేక్ వెల్లడించారు. జోర్డాన్ సైన్యం, యూఎస్ నుంచి వచ్చిన విమానాలు మరణాలకు కారణమయ్యాయని ఆరోపణలు రాగా వాటిని రెండు దేశాలు ఖండించాయి.

ప్రచారం కోసమే ఆరాటం: గాజా ప్రభుత్వం

ఈ ఘటనపై గాజా ప్రభుత్వ మీడియా స్పందించింది. ఎయిర్ డ్రాప్‌లను పనికి రానివని అభివర్ణించింది. వీటిని కేవలం ప్రచారం కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారని, సేవ చేయడానికి కాదని తెలిపింది. భూ సరిహద్దుల ద్వారా సహాయాన్ని అందించాలని కోరింది. ఎయిర్ డ్రాప్‌ల ద్వారా గాజా ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. ఈ పరిణామాలపై గతంలోనే హెచ్చరికలు జారీ చేశామని గుర్తు చేసింది. మరోవైపు సముద్ర సహాయ కారిడార్ ద్వారా సాయం అందించడం సరికాదని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. సరిహద్దు క్రాసింగ్‌ల ద్వారా గాజా చేరుకోవడానికి మరిన్ని ట్రక్కులను అనుమతించాలని కోరింది. కాగా, పాలస్తీనా ప్రజలకు మానవతాసాయం అందిస్తామని ఇటీవల అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం యుద్ధంలో ఇప్పటి వరకు 30,000 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Next Story