నోరూరించే గోంగూర ఎండు రొయ్యల కర్రీ.. రుచి చూస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే!

by Disha Web Desk 9 |
నోరూరించే గోంగూర ఎండు రొయ్యల కర్రీ.. రుచి చూస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే!
X

దిశ, ఫీచర్స్: చికెన్, మటన్ కర్రీల్లాగే ఎండు రొయ్యలను కూడా ఇష్టపడే వారు ఎంతోమంది ఉంటారు. ఎండు రొయ్యలతో ఎక్కువ మంది పులుసు లేదా ఇగురు వంటి వాటిని తయారు చేస్తారు. అయితే ఓసారి గోంగూర- ఎండు రొయ్యలు కలిపి కర్రీ చేయండి. టెస్ట్ ఎంతో బాగుంటుంది. ఒకసారి ఈ కూర రుచి చూస్తే మళ్లీ మళ్లీ చేయాలనుకుంటారు. అలాగే ఈ కర్రీని రెడీ చేయడం చాలా ఈజీ. మరీ ఎండు రొయ్యలు-గోంగూర కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

ఎండు రొయ్యలు-గోంగూర కర్రీ కి కావల్సిన పదార్థాలు!

ఎండు రొయ్యలు – 200 గ్రా, తగినన్ని వాటర్, ఆవాలు - ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ-1, మినపప్పు – ఒక టీస్పూన్, 2 రెమ్మల కరివేపాకు, ఎర్ర గోంగూర ఆకులు – 2 కట్టలు, తగినంత ఉప్పు, కారం, గరం మసాలా – అర టీ స్పూన్.

ఎండు రొయ్యలు-గోంగూర కూర తయారీ విధానం!

ముందుగా ఎండు రొయ్యలను తల, తోక తీసేసి క్లీన్ చేయాలి. తర్వాత గిన్నెలో వాటర్ పోసి, అందులో రొయ్యలు వేయాలి. రొయ్యలు ఒక పొంగు వచ్చే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అనంతరం ఈ రొయ్యలను చల్లటి నీటిలో వేసి బాగా కడిగి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. తర్వాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక తాళింపు దినుసులు వేసి.. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొంచెం పసుపు యాడ్ చేయాలి.

2 నిమిషాల తర్వాత అందులో రొయ్యలు వేసి బాగా కలపాలి. 15 నిమిషాల పాటు బాగా వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మరో 2 నిమిషాలయ్యాక గోంగూర ఆకులు వేసి కలపాలి. గోంగూర ఆకులు పూర్తిగా దగ్గర పడే వరకు మగ్గించాలి. ఇలా 15 నిమిషాల పాటు వేయించిన తర్వాత ఉప్పు, కారం వేయాలి. ఈ కర్రీని నూనె పైకి తేలే వరకు వేయించాక.. చివర్లో గరం మసాలా వేసి కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే గోంగూర-ఎండు రొయ్యల కర్రీ తయారైపోయినట్లే. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఆహా.. ఏమి రుచి అంటూ మళ్లీ మళ్లీ వండుకుని మరీ తినాలనిపిస్తుంది. మీరు కూడా గోంగూర-ఎండు రొయ్యల కర్రీ ఓ సారి ట్రై చేసి చూడండి.

Next Story

Most Viewed