రెండో అతిపెద్ద టెలికాం కంపెనీగా ఎయిర్‌టెల్!

by  |
రెండో అతిపెద్ద టెలికాం కంపెనీగా ఎయిర్‌టెల్!
X

దిశ,సెంట్రల్ డెస్క్: దేశంలో రెండో అతిపెద్ద టెలికాం కంపెనీగా భారతీయ ఎయిర్‌టెల్ స్థానం సంపాదించుకుంది. ఫిబ్రవరి చివరికి 28.35 శాతం మార్కెట్ షేర్ సొంత చేసుకోవడంతో ఎయిర్‌టెల్ రెండో స్థానాన్ని దక్కించుకుందని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాలు వెల్లడించాయి. ఇక, అగ్రస్థానంలో రిలయన్స్ జియో 62 లక్షల కొత్త వినియోగదారులతో టాప్ ప్లేస్‌ని కైవసం చేసుకుంది. ఇక, మూడో స్థానంలో వొడాఫోన్ ఐడియా 34 లక్షల వినియోగదారులకు కోల్పోయినట్టు ట్రాయ్ గణాంకాలు చెబుతున్నాయి. జనవరిలో వొడాఫోన్ ఐడియా రెండో స్థానంలో ఉండగా కేవలం నెల రోజుల వ్యవధిలో మూడో స్థానానికి పడిపోయింది. అలాగే, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఫిబ్రవరిలో తన వినియోగదారులను 4 లక్షలు పెంచుకుంది. ఇక, వైర్‌లెస్ చందాదారుల సంఖ్య 156 కోట్ల నుంచి 160 కోట్లకు పెరిగినట్టు ట్రాయ్ వెల్లడించింది. ట్రాయ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం..రిలయన్స్ జియో 32.99 శాతం మార్కెట్ షేర్‌ను కలిగి ఉంది. ఎయిర్‌టెల్ 28.35 శాతం, వొడాఫోన్ ఐడియా 28.05 శాతం, బీఎస్ఎన్ఎల్ 10.32 శాతం, ఎంటీఎన్ఎన్ఎల్ 0.29 శాతంతో కొనసాగుతున్నాయి. ఇక, చందాదారుల వారీగా చూస్తే..జియో 38.2 కోట్లు, ఎయిర్‌టెల్ 32.9 కోట్లు, వొడాఫోన్ 32.5 కోట్లు, బీఎస్ఎన్ఎల్ 11.9 కోట్లు, ఎంటీఎన్ఎల్ 34 లక్షల మంది చందాదారులను కలిగి ఉన్నట్టు ట్రాయ్ గణాంకాలు పేర్కొన్నాయి.


Next Story