దేశంలో ఒక్కరోజే 8380 కరోనా కేసులు

by vinod kumar |
దేశంలో ఒక్కరోజే 8380 కరోనా కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో : దేశంలో కరోనా కేసులు ఊహకు అందని విధంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 8,380 పాజిటివ్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు ఇంత ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,82,143కి చేరింది. దేశవ్యాప్తంగా కరోనాతో ఇప్పటివరకు 5,164 మంది మరణించారు. చైనాతో పోలిస్తే భారత్‌లో కరోనా కేసులు మూడు రెట్లు అధికంగా ఉన్నాయి. ఇప్పటివరకు 86,984 మంది కరోనా నుంచి కోలుకోగా ప్రస్తుతం 89,995 మంది చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా కరోనా వ్యాప్తి రోజు రోజుకూ ఎక్కువవుతోంది. దేశంలోనే ఇప్పటివరకు ఎక్కువ కేసులు నమోదైన మహారాష్ట్రలో ఆదివారం ఒక్కరోజే 2,497 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా రికార్డైన కేసులతో కలిపి మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 67,655కి చేరింది. రాష్ట్రంలో గడిచిన 15 రోజులుగా 2వేలకు పైనే కొత్త కేసులు రికార్డవుతున్నాయి. ఆదివారం 89 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2286కి చేరింది. రాజధాని ముంబైలోని ధారవి మురికివాడలో ఒక్కరోజే 38 కేసులు నమోదుకాగా ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 1,771కి చేరింది. ఆసియాలోనే అతిపెద్దదైన ఈ మురికివాడలో కరోనాతో ఇప్పటివరకు 71 మంది చనిపోయారు.

తమిళనాడులో ఒక్కరోజే 1,149 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 22,333కి చేరింది. రాష్ట్రంలో కరోనాతో 13 మంది మరణించడంతో ఇక్కడ ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 173కి చేరింది. రాజధాని చెన్నైలో ఆదివారం 804 పాజిటివ్ కేసులు నమోదు కాగా 13 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజే 1,295 కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 19,844కి వెళ్లింది. ఇక్కడ కొత్తగా నమోదైన 13 కరోనా మరణాలతో కలిపి మొత్తం చనిపోయిన వారి సంఖ్య 473కు చేరింది. గుజరాత్‌లో ఒక్కరోజే 438 కొత్త కేసులు నమోదవగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 16,794కి చేరింది. అలాగే, గుజరాత్‌లో ఆదివారం ఒక్కరోజే 31 మంది కరోనాతో చనిపోవడంతో.. మొత్తంగా మరణించిన వారి సంఖ్య 1,038కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే కొత్తగా 98 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 3,571కి చేరింది. ఇక్కడ ఇప్పటివరకు కరోనాతో 62 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 845 యాక్టివ్ కేసులున్నాయి.

Advertisement

Next Story

Most Viewed