సోనియా, అమిత్ షా పర్యటన వేళ రెండు పార్టీలకు బిగ్ షాక్!

by GSrikanth |
సోనియా, అమిత్ షా పర్యటన వేళ రెండు పార్టీలకు బిగ్ షాక్!
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంమంత్రి అమిత్ తెలంగాణ పర్యటన వేళ హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలను ప్రశ్నిస్తూ శనివారం తెల్లవారుజామున ప్లెక్సీలు వెలిశాయి. గోవా రిబరేషన్ డేకు రూ.300 కోట్లు ఇచ్చిన కేంద్రం తెలంగాణ ఇంటిగ్రేటెడ్ డేకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ప్లెక్సీల్లో పేర్కొన్నారు. అమిత్ షా ఏమైనా ప్రకటిస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్న పెన్షన్లు ఎంత అంటూ మరో ప్లెక్సీలో ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామన్న కాంగ్రెస్ ఎందుకు ఇవ్వలేకపోయిందని అడిగారు. కాంగ్రెస్ హయాంలో వరంగల్ జిల్లా నుంచి ఐటీ మంత్రిగా ఉండి వరంగల్‌కు ఒక్క ఐటీ కంపెనీ కూడా ఎందుకు తీసుకురాలేకపోయారు? అని ప్రశ్నించారు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉండి ఎస్సీ వర్గీకరణ చేయలేదని గుర్తుచేశారు. ఇప్పుడు ఎస్సీ డిక్లరేషన్‌ను కూడా అలాగే చేస్తారా? అని నగరంలో వెలిసిన ప్లెక్సీల్లో ఎద్దేవా చేశారు.

కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో తలపడనున్న మూడు ప్రధాన పార్టీలు తెలంగాణ మీద ఫోకస్ పెట్టాయి. పోటాపోటీ ప్రోగ్రామ్‌లకు శ్రీకారం చుడుతున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో రకమైన కార్యక్రమంతో శుక్రవారం మొదలు సోమవారం వరకు రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కనున్నది. ప్రారంభోత్సవాల పేరుతో బీఆర్ఎస్, పార్టీ సమావేశాలతో కాంగ్రెస్, విమోచనోత్సవం పేరుతో బీజేపీ వేర్వేరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో విమోచన దినోత్సవంలో హాజరయ్యేందుకు రేపు అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. సీడబ్ల్యూసీ సమావేశం కోసం కాంగ్రెస్ అగ్రనేతలూ రాష్ట్రానికి రానున్నారు. ఈ క్రమంలో ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు వెలవడం రాష్ట్ర నేతలను కలవరపాటుకు గురి చేస్తోంది. దీనిపై ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి. ఏ కామెంట్‌కు ఎవరు ఎలా కౌంటర్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed