వర్షం కోసం ఆకాశం వైపు కాకుండా మొక్కల వైపు చూసే పరిస్థితి రావాలి: మంత్రి సీతక్క

by Aamani |
వర్షం కోసం ఆకాశం వైపు కాకుండా మొక్కల వైపు చూసే పరిస్థితి రావాలి: మంత్రి  సీతక్క
X

దిశ,ములుగు ప్రతినిధి: ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అనసూయ జాకారం సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ, డి ఎఫ్.ఓ రాహుల్ కిషన్ జాదవ్ లతో కలిసి మొక్కలు నాటి వన మహోత్సవం కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించారు. అనంతరం మంత్రి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.మంత్రి, జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేయడం తో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యత , మొక్కల పెంపకం, పచ్చదనం ప్రాముఖ్యత విద్యార్థి దశ నుంచే పిల్లలకు తెలియాలనే ఉద్దేశ్యంతో పాఠశాల వద్ద వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అధికారులు జవాబుదారీతనంతో పూర్తి చేయాలని మంత్రి సూచించారు.

మొక్కల పెంపకం చాలా మంచి ఆలోచన అని, దీనివల్ల అనేక లాభాలు ఉంటాయని తెలిపారు. ఆలోచన బాగా ఉన్న ఆచరణ సరిగ్గా లేకపోతే ఆశించిన ఫలితాలు దక్కవని, పటిష్ట కార్యాచరణతో వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మొక్కలను నాటడంలో పెద్ద లక్ష్యాలను ఏర్పాటు చేసుకోకుండా, తక్కువ మొక్కలు నాటినప్పటికీ వాటిని వంద శాతం సంరక్షించాలని అన్నారు. ఇంటింటికీ పంపిణీ చేసే మొక్కలు, రోడ్డుపై నాటే మొక్కల లెక్కలు పక్కాగా ఉండాలని, జాతీయ రహదారి, తొంగలు, వాగులు ఇరువైపులా అవసరమైన మేర మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ప్రభుత్వం నాటుతున్న మొక్కలు, ఇండ్లకు పంపిణీ చేస్తున్న మొక్కల ఆడిట్ నిర్వహించాలని అన్నారు. మొక్కల పంపిణీ పూర్తి చేసిన తర్వాత రెగ్యులర్ గా ఇంటింటికి సర్వే నిర్వహిస్తూ ఆ మొక్కల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, జిల్లా కేంద్రం లో ప్రజలకు అవసరమైన పూల మొక్కలు, ఇతర మొక్కలు కుండీలలో పెంచే విధంగా అందించే అవకాశాలు పరిశీలించాలని మంత్రి అధికారులకు సూచించారు.

పచ్చదనం పెంచేందుకు చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని ఉద్యమంలా కొనసాగించాలని, రాజకీయాలకతీతంగా అందరినీ కలుపుకొని పనిచేయాలని, ఆర్ అండ్ బీ శాఖ ప్రణాళికలు దృష్టిలో పెట్టుకుని రోడ్డుకు ఇరు వైపులా కొంచెం స్థలం విడిచిపెట్టి మొక్కల పెంపకం చేపట్టాలని, పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించేలా చూడాలని, మొక్కల పెంపకం ప్రాముఖ్యతను ఇంటింటికి తిరిగి వివరించి ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. వర్షం కోసం ఆకాశం వైపు కాకుండా మొక్కల వైపు చూసే పరిస్థితి రావాలని, ఎక్కువ అటవీ ప్రాంతం మొక్కలు చెట్లు ఉన్న ప్రాంతాలలో సమృద్ధిగా వర్షపాతం ఉంటుందని తద్వారా స్థానిక రైతులకు వ్యవసాయానికి సమృద్ధి సాగునీరు అందుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ములుగు జిల్లాలో 76-77 అటవీ శాతం ఉందని దీని ద్వారానే ములుగు జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని కురిసిన వర్షపు నీటిని నిల్వ చేయడం కోసం చెరువులు, కుంటలు, చెక్ డ్యాముల ద్వారా నిర్మాణం జరగాలని అటవీ ప్రాంతంలో కూడా చెక్ డాంల నిర్మాణాలు చేపట్టాలని దీని ద్వారా వర్షపు నీరు నిల్వ ఉండటం ద్వారా అటవీ ప్రాంతంలో ఉండే అటవీ జంతువులకు అటవీ వృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అడవులను నరకరాదని ప్రతి ఒక్కరు మొక్కల పెంచుటకు కృషి చేయాలని, ములుగు ప్రాంతాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్ ఉందని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవతో ఫైల్ ను ముందుకు తీసుకు వెళ్లడం జరిగిందని, త్వరలోనే మల్లంపల్లి మండల ఏర్పాటు, ఏటూరు నాగరం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం అని తెలిపారు.విద్యార్థులు మంచిగా చదువుకొని సివిల్ సర్వీసెస్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ వైద్యులు ఇలా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని మంత్రి పేర్కొన్నారు. వసతి గృహాల్లోని విద్యార్థులకు మెరుగైన విద్య, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. వానా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని, ఈగలు, దోమలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో సోషల్ వెల్ఫేర్ ఆర్సీఓ విద్యారాణి, డి ఆర్ డి ఓ శ్రీనివాస్ కుమార్, డీఎస్పీ రవీందర్, తహసీల్దార్ విజయ భాస్కర్, ఎం పి డి ఓ రామకృష్ణ, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed