పుష్కరాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

by Sridhar Babu |
పుష్కరాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
X

దిశ, మల్హర్(కాళేశ్వరం) : కాళేశ్వరంలో మే 15 నుండి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతి పుష్కరాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ సూచించారు. గురువారం కాలేశ్వరం దేవస్థాన ఆవరణలో జరుగుతున్న పుష్కరాల అభివృద్ధి పనులపై కమిషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే తో పాటు వివిధ శాఖల అధికారులతో ఈఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. సరస్వతి విగ్రహం ఏర్పాటుకు స్థలం నిర్ణయించాలని, వీఐపీ ఘాట్ నుండి గోదావరి ఘాట్ వరకు రహదారి నిర్మాణం, పురుషులు, మహిళల కోసం శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం చేయాలని ఆదేశించారు.

గోదావరి నదికి ప్రత్యేకంగా ఇచ్చే హారతిపై ఏర్పాట్లు చేయాలని కోరారు. పుష్కర సమాచారం తెలిసేలా ప్రత్యేకంగా యాప్ తయారు చేయాలని, విస్తృత ప్రచారానికి అంబాసిడర్ ను నియమించాలన్నారు. 12 రోజుల ఈ కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూల్ తయారు చేయాలని ఈఓను ఆదేశించారు. చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని, సత్రం పనులను పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సూచించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, ప్రసాదాల కౌంటర్లు, మంచినీరు సరఫరా చేయాలని, ప్రమాద హెచ్చరికల బోర్డ్​లు ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. అంతకు ముందు వీఐపీ ఘాట్, గోదావరి ఘాటు వద్ద చేపట్టనున్న పనులను, సత్రం పనులను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇంజినీరింగ్ శాఖల ద్వారా చేపట్టనున్న పనుల ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఆర్జేసీ రామకృష్ణారావు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్ డబ్ల్యూఎస్, విద్యుత్, దేవస్థానం తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed