భూ సమస్యల పరిష్కారానికి నూతన ఆర్ఓఆర్ చట్టం దోహదం

by Sridhar Babu |
భూ సమస్యల పరిష్కారానికి నూతన ఆర్ఓఆర్ చట్టం దోహదం
X

దిశ, హనుమకొండ : నూతన ఆర్ఓఆర్-2024 ముసాయిదా చట్టంలో భూ సమస్యల పరిష్కారానికి చాలా అంశాలు ఉన్నాయని, దాంతో సమస్యలు పరిష్కారం అవుతాయని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా స్థాయిలో నూతన రెవెన్యూ (ఆర్ఓఆర్ )-2024 ముసాయిదా చట్టం పై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ చర్చా కార్యక్రమానికి రెవెన్యూ అధికారులతో పాటు జిల్లాలోని పలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, విశ్రాంత రెవెన్యూ అధికారులు, న్యాయవాదులు, రైతు సంఘాల నాయకులు, రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. నూతన చట్టానికి సంబంధించి సలహాలు,

సూచనలు ప్రభుత్వానికి నివేదించేందుకు చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నూతన ఆర్ఓఆర్ చట్టంలో పొందుపరిచిన అంశాలతో పాటు ఇంకా ఏవైనా చేర్చాల్సిన అంశాలు, ఇంకా ఏవైనా లోపాలు ఉన్నట్లయితే ఈ చర్చా కార్యక్రమంలో తెలియజేసిన సలహాలు, సూచనలు దోహదపడతాయ న్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం నూతన చట్టం రూపకల్పనకు సలహాలు, సూచనలు తీసుకుంటుందన్నారు. నూతన చట్టం ముసాయిదాపై చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ సంబంధిత అంశాలను తెలియజేసేందుకు ఇదొక మంచి అవకాశం అని, నూతన చట్టానికి అభిప్రాయాలు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ ఆర్డీవో వెంకటేష్ మాట్లాడుతూ 20 సెక్షన్లలో వివిధ అంశాలను నూతన రెవెన్యూ చట్టంలో పొందుపర్చారని పేర్కొన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు సంబంధించి హక్కులకు ముసాయిదా రూపకల్పన చేస్తుందన్నారు. ఈ సందర్భంగా పలువురు భూములకు సంబంధించిన హక్కుల సమస్యలు, మ్యుటేషన్, ధరణి లో ఎదురవుతున్న ఇబ్బందులు, నూతన చట్టంలో తీసుకురావాల్సిన వివిధ అంశాలు, తదితర విషయాల గురించి సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, పరకాల ఆర్డీవో డాక్టర్ నారాయణ, వ్యవసాయ శాఖ జేడీ రవీందర్ సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed