ప్రేమ పేరుతో… కానిస్టేబుల్ పెళ్లికి నిరాకరణ

by Kalyani |   ( Updated:2024-10-28 12:12:13.0  )
ప్రేమ పేరుతో… కానిస్టేబుల్ పెళ్లికి నిరాకరణ
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి వెళ్ళాలనుకున్న యువతిని మోసాగించాడో కానిస్టేబుల్. పెళ్లి చేసుకునేందుకు సిద్ధమై ఎంగేజ్మెంట్ చేసుకుని తీరా తనకో ప్రేమికురాలు ఉందని బుకాయించాడు. ఈ హఠాత్తు పరిణామంతో కంగుతిన్న యువతి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకుంటానని మోసగించిన కానిస్టేబుల్ పై కేయూ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే...హన్మకొండ యాదవ నగర్ కు చెందిన లింగంపల్లి కుమార్ కూతురుతో హాసన్ పర్తి మండలం వంగపహాడ్ గ్రామానికి చెందిన కావటి వినయ్ నిశ్చితార్థం చేసుకున్నాడు. ములుగులో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వినయ్ తన తల్లిదండ్రులు, పెద్ద మనుషులతో కలిసి ఈనెల 17న కట్న కానుకలు మాట్లాడుకున్నారు.

రూ. 20 లక్షల నగదు, బంగారం కావాలని అడగడంతో ఒప్పుకుని లక్ష రూపాయలు కట్నంగా ఇచ్చారు. నిశ్చితార్థం తర్వాత తనకు కట్నం సరిపోలేదని, వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని చెప్పి పెళ్లికి నిరాకరించాడు. పెద్ద మనిషితో ఈనెల 23న సమాచారం పంపడంతో కంగుతిన్న యువతి కుటుంబం లబోదిబోమన్నది. పెళ్లి చేసుకుంటానని చెప్పి కట్నం కూడా తీసుకుని నిశ్చితార్థం తర్వాత నిరాకరించి మా కుటుంబ పరువు పోయేలా చేసిన కానిస్టేబుల్ తో పాటు వారి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ యువతి తండ్రి లింగంపల్లి కుమార్ కేయూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సెక్షన్ 318(4) రెడ్ విత్ 3(15) కింద పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story