Venkaiah : ఈ మూడు సూత్రాలు పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

by Ramesh N |   ( Updated:2024-09-15 10:12:09.0  )
Venkaiah : ఈ మూడు సూత్రాలు పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మూడు సూత్రాలను నిక్కచ్చిగా పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ బోరబండలోని నాట్కో ప్రభుత్వ పాఠశాలలో స్వర్ణ భారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్, ఏజీ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఉచిత వైద్య శిబిరాన్ని తాను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పేదలు పెద్ద పెద్ద ఆసుపత్రుల వరకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడం కన్నా కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులే బస్తీ ప్రజల వద్దకు వచ్చి వైద్య పరీక్షలు చేసి, తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలన్న మంచి ఆలోచనతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు.

పౌష్టికాహారం తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, దురలవాట్లకు దూరంగా ఉండటం అనే ఈ మూడు సూత్రాలను నిక్కచ్చిగా పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందన్నారు. ఈ మూడు సూత్రాలపై వైద్యులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు.

బోరబండ బస్తీలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడంలో భాగస్వాములైన ఏఐజీ ఆస్పత్రి యాజమాన్యానికి, ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ నవీన్ రెడ్డికి, శిబిరంలో పాల్గొని ప్రజలకు సేవలు అందించిన వైద్యులు, ఇతర సిబ్బందికి, చక్కటి ఏర్పాట్లు చేసిన పాఠశాల యాజమాన్యానికి, స్వర్ణ భారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ నిర్వాహకులు కృష్ణ ప్రసాద్‌, సుబ్బారెడ్డి‌కి, బోరబండ లోని స్థానిక నాయకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed