- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
విచారణ లేకుండా క్రిమినల్ కేసులు తగదు.. డీజీపీని కోరిన ట్రెసా ప్రతినిధి బృందం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పలు జిల్లాల్లో విధి నిర్వహణలో భాగంగా రెవెన్యూ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాల్లో అక్కడక్కడ ఎవరైనా ఫిర్యాదు చేయగానే ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కేసులు నమోదు చేస్తున్నారని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఎలాంటి విచారణ లేకుండా మెజిస్ట్రేట్ హోదాలో ఉన్న తహశీల్దార్లు, ఆర్డీవోలపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం తగదన్నారు. శుక్రవారం డీజీపీ జితేందర్ ని ట్రెసా అధ్యక్ష కార్యదర్శులు వంగ రవీందర్ రెడ్డి, కే గౌతమ్ కుమార్ నేతృత్వంలో బృందం కలిసింది. వనపర్తి, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్ జిల్లాల్లో ఎలాంటి ముందుస్తు అనుమతి లేకుండా తహశీల్దార్లు, ఆర్డీవోలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారని ఫిర్యాదు చేశారు.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 197(CrPC), కొత్త చట్టం భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023 సెక్షన్ 218(BNSS) కింద ఏదైనా మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న అధికారిపైన విధి నిర్వహణలో భాగంగా తీసుకునే చర్యలపై కేసు నమోదు చేసి విచారణ చేయడానికి జిల్లా కలెక్టర్/ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఉందన్నారు. అది చట్టం చెబుతుందని, దీనిపై అన్ని జిల్లాల ఎస్పీలకు, పోలీస్ కమిషనర్లకు రాతపూర్వమైన ఆదేశాలు ఇవ్వాలని డీజీపీని కోరారు. గతంలోనూ అనేక సార్లు విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు. అలాగే ఇటీవల బాచుపల్లి తహశీల్దార్ పూల్ సింగ్ సర్వేకి సంబంధించిన విషయంలో లొకేషన్ స్కెచ్ పై అటెస్టెడ్ చేశారని, దానికి క్రిమినల్ కేస్ నమోదు చేశారన్నారు. ఆ కేసు నుంచి ఆయన పేరును తొలగించాలని, దీనిపై జిల్లా కలెక్టర్ తో విచారణ చేయించాలన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డీజీపీ ట్రెసా విజ్ఞప్తిని పరిశీలించి అన్ని జిల్లాల ఎస్పీలకు, పోలీస్ కమిషనర్లకు తగు ఆదేశాలిస్తామని హామీ ఇచ్చారు.