TPCC: బీజేపి నేతలు నల్లపిల్లులు.. సామా రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
TPCC: బీజేపి నేతలు నల్లపిల్లులు.. సామా రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ నేతలు నల్లపిల్లుల్లా ప్రతి మంచి పనికి అడ్డం పడుతున్నారని, వారు రాష్ట్రానికి చేసిందేమో లేదని, పదేండ్లు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి అన్నారు. గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం విదేశీ పర్యటనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సహా అధికారుల బృందం విదేశీ పర్యటన చేస్తుందని, ఇందులో కాగ్నిజెంట్ విస్తరణతో తొలి సక్సెస్ సాధించిందని, టైర్ టు సిటీలో కూడా కాగ్నిజెంట్ బ్రాంచ్‌లు ఏర్పాటు చేసేలా ఒప్పందం జరిగిందని తెలిపారు.

గత సర్కార్ కాకిలెక్కలతో కోట్ల రూపాయలను దోచుకుందని, గత సీఎం ఎప్పుడైనా పెట్టుబడుల కోసం విదేశీ పర్యటన చేశారా అని ప్రశ్నించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి పునాది రాయి వేస్తే, బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందని, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో ఉపాధి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని స్పష్టం చేశారు. ఇక బీజేపి రాష్ట్రానికి చేసింది ఏమి లేదని, కేంద్రం పదేండ్లు ఒక్కపైసా కూడా ఇవ్వలేదని ఆరోపించారు. స్కిల్ యూనివర్సిటీ పేరుతో భూదందా చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపణలు చేస్తున్నారని, భూ దందాలకు కేరాఫ్ అడ్రస్ బీజేపి అని విమర్శించారు.

బండి సంజయ్, కిషన్ రెడ్డిలు కేంద్రమంత్రులుగా వుండి ఏం లాభం లేదని, ఒకవైపు కులగణన చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తూనే.. మరోవైపు లోకల్ బాడీలకు కేంద్ర నిధులు రాకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారని, బీజేపీ నేతలు స్టాండ్ లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక బీజేపీ నేతలు నల్ల పిల్లులు అని చెబుతూ.. ప్రతి మంచి పనికి అడ్డం పడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ, ఆంధ్ర అనే ఆలోచన లేకుండా ఆహ్వానిస్తున్నారని, ప్రాంతీయ తేడాలు లేకుండా ఏ స్టేట్ వారైనా తెలంగాణకు రావచ్చని, అమెరికాలో వున్న తెలుగు వాళ్ళ కంపెనీలు రాష్ట్రానికి రావాలని కోరుతున్నారని సామా రామ్మోహన్ రెడ్డి తెలియజేశారు.

Advertisement

Next Story