టీజీటీ ఎస్ వ్యాపార పరిధిని పెంచుకోవాలి: మంత్రి శ్రీధర్ బాబు

by Mahesh |
టీజీటీ ఎస్ వ్యాపార పరిధిని పెంచుకోవాలి: మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ (టీజీటీ ఎస్) సంస్థ పరిధిని మరింత విస్తృత పరచుకోవాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచించారు. గత ఏడాది రూ.5 కోట్ల లాభం ఆర్జించడం అభినందనీయమని, ఈ ఏడాది టర్నోవర్ వృద్ధిని సాధించాలని సూచించారు. హాకా భవన్ లో శుక్రవారం టీజీటీఎస్ పనితీరును సమీక్షించారు. ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ విభాగాలన్నీ సంస్థ ద్వారా కంప్యూటర్ సంబంధిత పరికరాలు, సాఫ్ట్‌వేర్లను సేకరించుకునేలా సమన్వయం చేసుకోవాలన్నారు. కొనుగోళ్ల కంటే భారీ ఆర్డర్ల ద్వారా రాయితీలు, తక్కువ ధరకే ఎలక్ట్రానిక్ పరికరాలు సేకరించవచ్చని పేర్కొన్నారు.

ప్రభుత్వ విభాగాల ఆధునీకరణకు కేంద్రం నిధులు అందిస్తే ఆర్డర్లు వస్తాయని తద్వారా పనితీరు మెరుగు పర్చుకోవాలని ఆదేశించారు. టీజీటీఎస్ ప్రస్తుతం పోలీసు, పలు ప్రభుత్వ విభాగాలకు కంప్యూటర్ సంబంధిత పరికాలకు తోడు సీసీ కెమెరాలు, ఫోరెన్సిక్ సైన్స్ విభాగానికి నేర నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన పరికరాలు కొనుగోలు చేసి అందజేస్తోందన్నారు. సంస్థ ఎండీ శంకరయ్య మాట్లాడుతూ ప్రస్తుతం 44 ప్రభుత్వ విభాగాలు, 140 విభాగాలకు టీజీటీ ఎస్ సేవలు అందిస్తోందన్నారు. కార్యక్రమంలో చైర్మన్ మన్నె సతీశ్ కుమార్, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవీశ్ మిశ్రా, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed