ఛార్జీలు పెంచితే సొంతింటి కల దూరమే: TRA

by GSrikanth |   ( Updated:2024-05-17 14:01:46.0  )
ఛార్జీలు పెంచితే సొంతింటి కల దూరమే: TRA
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూముల మార్కెట్ విలువకు, క్రయవిక్రయ ధరలకు మధ్య భారీ వ్యత్యాసం వాస్తవమే. కానీ ధరలు, ఛార్జీలు పెంచితే పేద, మధ్య తరగతి వర్గాలు సొంతింటి కలకు దూరమవుతారని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. మార్కెట్ విలువ రెట్టింపు చేయాల్సి వస్తే స్టాంపు డ్యూటీని 7.5 % నుంచి 3 శాతానికి తగ్గించాలన్నారు. కొనుగోలుదారులకు, అమ్మకందారులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. కేవలం మార్కెట్ విలువ పెంచి స్టాంపు డ్యూటీ 7.5 శాతం ఉంచితే రిజిస్ట్రేషన్ ఛార్జీలు కొనుగోలుదారులకు భారం అవుతాయన్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చార్జీలతో పాటు ఎల్ఆర్ఎస్ ఛార్జీలను కలుపుకుంటే రూ.లక్షల్లో చెల్లించాల్సి వస్తుందన్నారు. మార్కెట్ విలువ పెంచినా, ఎల్ఆర్ఎస్ ఛార్జీలు పెరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

మార్కెట్ విలువకు, ఎల్ఆర్ఎస్‌కు లింక్ ఉంటుంది. మార్కెట్ విలువపైననే ఎల్ఆర్ఎస్ ఛార్జీలు వసూలు చేస్తారన్నారు. తెలంగాణలో 142 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉంటే 100కు పైగా కార్యాలయాలు కిరాయి ఇండ్లల్లోనే కొనసాగుతున్నాయన్నారు. అవి కూడా అరకొర వసతులతో ఉన్నాయన్నారు. కనీసం మంచినీటి సదుపాయం, కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవన్నారు. అయితే కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలన్న సీఎం ఆలోచన హర్షించదగినదని కొనియాడారు. ఉదాహారణకు ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నిర్మాణానికి ఉప్పల్ బగాయత్‌లో స్థలం కేటాయించి సంవత్సరాలు గడుస్తున్నా నిర్మాణానికి నోచుకోలేదన్నారు. ప్రస్తుతం కేసీఆర్ నగర్‌లో అద్దె భవనానికి నెలకు రూ.1.80 లక్షలు చెల్లిస్తున్నట్లు గుర్తు చేశారు. సొంత భవనాల ద్వారా ఖర్చు కూడా తగ్గుతుందన్నారు.

Advertisement

Next Story