రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర.. BJPపై CM రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర.. BJPపై CM రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: ప్రధానిమోడీ, బీజేపీలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం హైదరాబాద్ గాంధీభవన్‌లో బీజేపీపై ఛార్జ్ షీట్ విడుదల చేసిన అనంతరం సీఎం మాట్లాడారు. బీజేపీ డబుల్ ఇంజిన్ అంటే అంబానీ, అదానీయే అన్నారు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ హామీ ఇచ్చారని.. హామీ ప్రకారం పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కదా అని ప్రశ్నించారు. కానీ బీజేపీ హయాంలో 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారన్నారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోడీ సర్కార్ మోసం చేసిందన్నారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని.. రూ.15 పైసలు కూడా వేయలేదని సెటైర్లు వేశారు.

అగ్గిపెట్టె, అగరుబత్తి మీద కూడా మోడీ ప్రభుత్వం జీఎస్టీ విధించిందన్నారు. 67 సంవత్సరాల్లో 14 మంది ప్రధానులు 55 లక్షల కోట్లు అప్పు చేస్తే.. ఈ పదేళ్లలో మోడీ చేసి అప్పు 113 లక్షల కోట్లు చేశారన్నారు. నయా భారతాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. ఎల్ఐసీ సహా ప్రతి ప్రభుత్వ సంస్థను కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తున్నారన్నారు. వందేళ్లలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలనేదే ఆర్ఎస్ఎస్ విధానం అన్నారు. ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి 2025కు వంద సంవత్సరాలు అవుతుందన్నారు.అందుకే రిజర్వేషన్లు రద్దు చేసేందుకు మోడీ కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు.

బీజేపీ విధానం దేశంలో ఉన్న రిజర్వేషన్లు రద్దు చేయడమే అని రేవంత్ అన్నారు. ఆర్ఎస్ఎస్ విధానాలనే బీజేపీ అమలు చేస్తోందన్నారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఓబీసీ కుల గణన చేపడితే.. రిజర్వేషన్లు 70 నుంచి 75 శాతానికి పెరిగే అవకాశం ఉందన్నారు. అందుకే ఈ రిజర్వేషన్లు రద్దు చేయాలనే కుట్ర జరుగుతోందన్నారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లే రేవంత్ అన్నారు. బీజేపీకి ఓటు వేస్తే మీ హక్కును మీరు కాలరాసుకున్నట్లే అన్నారు. రిజర్వేషన్ల రద్దు కోసమే బీజేపీ 400 సీట్లు కావాలని అంటోందన్నారు. 2/3 మెజార్టీతో రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర పన్నుతోందని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.



Next Story

Most Viewed