నాసిరకంగా పంచాయతీ భవనాలు.. నామమాత్రంగా అధికారుల పర్యవేక్షణ

by Aamani |
నాసిరకంగా పంచాయతీ భవనాలు.. నామమాత్రంగా అధికారుల పర్యవేక్షణ
X

దిశ, శంకర్పల్లి : పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపం కాంట్రాక్టర్ స్వార్థం మూలంగా నాసిరకంగా భవన నిర్మాణం పనులు చేపట్టడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయలు ప్రజాధనం వెచ్చించి భవన నిర్మాణాలు చేపడితే ఎన్నో కాలాలపాటు ఉండాల్సిన భవనాలు కళ్ళముందే తలుపులు విరిగిపోవడం కిటికీలు పట్టకపోవడం తలుపులు సక్రమంగా బిగించకపోవడం ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలం మహాలింగాపురం గ్రామంలో రూర్బన్ నిధులురూ. 20 లక్షలతో చేపట్టిన గ్రామ పంచాయతీ భవనం నిర్మించి 16 నెలలు కూడా పూర్తికాకముందే అప్పుడే మరుగుదొడ్డి తలుపు విరిగిపడటం చూస్తుంటే పనులు ఎంత పటిష్టంగా జరిగాయో అర్థం అవుతుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరుగుదొడ్డి తలుపు విరిగిపడడం తోపాటు కిటికీలు కూడా సక్రమంగా బిగించలేదని కాంట్రాక్టర్ నాసిరకంగా పనులు చేపట్టితే అందుకు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు తూతూ మంత్రంగా పర్యవేక్షణ చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి వారు కూడా చేయూత అందించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించిన తర్వాత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారులు పనుల నాణ్యతను పరిశీలించి పనులు సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలించి బిల్లులు చెల్లించాలి. పనులు జరుగుతున్న చోట అధికారులు ఎవరూ కూడా కనిపించకపోవడం కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా నాసిరకంగా పనులు చేస్తున్న వారిచ్చే మామూళ్లకు అలవాటు పడ్డ అధికారులు వారు ఏ విధంగా పనులు కొనసాగించి నప్పటికీ సై అంటూ చెప్పడంతో కళ్ళముందే భవనాలు కూలిపోతున్న పట్టించుకునే వారే కరువయ్యారు.

కొత్తగా గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం నిర్మిస్తున్నారన్న సంతోషం మరుగుదొడ్డి ని చూస్తే అర్థమవుతుందని గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న రూర్బన్ నిధులతో పంచాయతీ భవనాలు నిర్మిస్తున్న ప్పటికీ పనులు నాణ్యతగా చేసే విధంగా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సి ఉంది. కానీ అవేవీ పట్టించుకోకపోవడంతో మహాలింగాపురం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభించి 16 నెలలు గడవక ముందే మరుగుదొడ్డి తలుపు విరిగిపోవడం చూస్తుంటే పనులు ఎంత నాణ్యతగా జరిగాయో అర్థం అవుతుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి నాసిరకంగా నిర్మాణం పనులు జరుగుతున్న అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed