Hydra : మూసీలో ఎలాంటి కూల్చివేతలు చేపట్టడం లేదు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన ప్రకటన

by Ramesh N |
Hydra : మూసీలో ఎలాంటి కూల్చివేతలు చేపట్టడం లేదు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: మూసీ నది ప‌రీవాహ‌క ప్రాంతాల్లో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. మూసీ న‌దికి ఇరువైపులా స‌ర్వేల‌తో హైడ్రాకు సంబంధం లేదని, అక్క‌డి నివాసితుల‌ను హైడ్రా త‌ర‌లించ‌డంలేదన్నారు. అక్క‌డ ఎలాంటి కూల్చివేత‌లు హైడ్రా చేప‌ట్ట‌డంలేదని, మూసీ ప‌రీవాహ‌క ప్రాంతంలోని ఇళ్ల‌పై హైడ్రా మార్కింగ్ చేయ‌డంలేదన్నారు. మూసీ సుంద‌రీక‌ర‌ణ ప్ర‌త్యేక ప్రాజెక్టు అని, దీనిని మూసీ రివ‌ర్‌ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చేప‌డుతోందన్నారు. ఈ విషయాలు సోమవారం హైడ్రా అధికార ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు.

కాగా, గత కొన్ని రోజులుగా మూసీ నదికి ఇరువైపు సర్వే చేపడుతున్నారని వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో సర్వే చేస్తున్న అధికారులు నదిలో కట్టిన నిర్మాణాలు, బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలో కట్టిన నిర్మాణాలకు మార్కింగ్ చేస్తున్నారని స్థానికులు ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. దీంతో ఆ మార్కింగ్ ఆపేసినట్లు తెలిసింది. అయితే, మూసీ నది ప‌రీవాహ‌క ప్రాంతాల్లో కూల్చివేతలు ప్రచారంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాయి.

ఇక తెలంగాణ హైకోర్టు సైతం హైడ్రాపై సిరియస్ అయింది. సోమావారం కమిషనర్ రంగనాథ్ వర్చువల్‌గా హైకోర్టుకు హజరయ్యారు. జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం హైడ్రా కూల్చివేతపై విచారణలో కీలక వ్యాఖ్యలు చేసింది. చార్మినార్ తహశీల్దార్ చెబితే హైకోర్టును కూల్చేస్తారా? అంటూ ప్రశ్నించింది. కేవలం శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాతే కూల్చివేతలు ఎందుకు, అత్యవసర కూల్చివేతలు ఎందుకు, ఉన్నతాధికారులను మెప్పించేందుకు ఎవరూ చట్ట విరుద్దంగా పని చేయవద్దని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 15 కు వాయిదా వేసింది. దీంతో మూసీ కూల్చివేతల ప్రచారం విషయం ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలోనే మూసీ న‌దికి ఇరువైపులా స‌ర్వేల‌తో హైడ్రాకు సంబంధం లేదని కమిషనర్ తాజాగా ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed