శభాష్.. మునిగిపోతున్న మహిళను కాపాడిన ఇద్దరు యువకులు

by Nagam Mallesh |
శభాష్.. మునిగిపోతున్న మహిళను కాపాడిన ఇద్దరు యువకులు
X

దిశ, నాగిరెడ్డిపేట్ : ఇద్దరు యువకులు ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు. ఆత్మహత్య చేసుకుందామని పోచారం ప్రాజెక్టులో దూకిన మహిళ మునిగిపోతుండగా చూసిన ఇద్దరు యువకులు ఏ మాత్రం ఆలోచించకుండా నీటిలో దూకి ఆమెను కాపాడారు. మెదక్ జిల్లా కేంద్రానికి చెందిన వనం నాగరాణి (33) అనే మహిళ కుటుంబ కలహాలతో, జీవితంపై విరక్తి చెంది సోమవారం సాయంత్రం పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువ గేట్ల వద్ద తన మొబైల్ ఫోన్ ను ఉంచి, నీటిని విడుదల చేసే గేట్ల పైనుండి నీటిలోకి దూకింది. ఇదే సమయంలో అక్కడే ఉన్న మండలంలోని మాల్ తుమ్మెద గ్రామానికి చెందిన నరేష్, అఖిల్ అనే యువకులు నీటిలోకి దూకి వనం నాగరాణిని కాపాడారు. పైకి తీసుకువచ్చి ప్రాజెక్టు ప్రధాన కాలువ దిమ్మెలపై ఆమెను ఉంచి.. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్సై మల్లారెడ్డి హుటా హుటిన పోలీస్ కానిస్టేబుల్ నాయిని వినోద్ తో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాగరాణి కడుపులో నుండి నీటిని తొలగించి ప్రాణాలు కాపాడారు. అనంతరం వనం నాగరాణి కుటుంబ సభ్యులకు రప్పించి వారికి అప్పగించారు. ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన మహిళను నీటిలో నుండి ఒడ్డుకు చేర్చిన యువకులను ఎస్సై మల్లారెడ్డి, స్థానికులు అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed