59 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు.. వినోద్ కుమార్

by Sumithra |
59 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు.. వినోద్ కుమార్
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గ శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ల నుంచి ఎన్నికల సామాగ్రి తీసుకొని ఎన్నికల సిబ్బంది బుధవారం మధ్యాహ్నం రూట్ల వారీగా పట్టణం, గ్రామాల్లోని పోలింగ్ బూతులకు తరలివెళ్లారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్, ఆలూర్, డొంకేశ్వర్, నందిపేట్, మాక్లూర్ మండలాలతో పాటు ఆర్మూర్ పట్టణంలో 111 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటిలో 217 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు. ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామాగ్రి ఇవ్వడానికి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి శ్రీకాంత్ లు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద పరిస్థితిని సమీక్షిస్తూ సూచనలు చేశారు.

నియోజకవర్గంలో 217 పోలింగ్ బూత్ ల కోసం 1050 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. వీరిలో పీవోలు 217 మంది, ఏపీవోలు 217, ఇతర సిబ్బంది 434 మంది ఉన్నారు. వీరు కాక అదనంగా రిజర్వ్ ఎన్నికల సిబ్బంది ఉన్నారు. వీరి కోసం ఆర్మూర్ లో రాత్రి వేళల్లో ఉండడానికి బసతో పాటు సౌకర్యాల ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 21 రూట్లను ఏర్పాటు చేసి, ఈ రూట్ లలో 38 బస్సులను ఏర్పాటు చేశారు. 21 డిస్ట్రిబ్యూట్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికల సిబ్బందికి సీయు కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వివిప్యాట్ తో పాటు 40 వస్తువులతో కూడిన బ్యాగులను అందజేశారు. 271 సియు కంట్రోల్ యూనిట్లు, 271 బ్యాలెట్ యూనిట్లు, 303 వీవీ ప్యాట్లను ఎన్నికల సిబ్బందికి అందజేశారు. ఈ వస్తువులను ఎన్నికల సిబ్బంది లెక్కించుకున్న తర్వాత భోజనాలు చేశారు. భోజనాల తర్వాత ఆయా రూట్లలో వెళ్లే బస్సులలో ఎన్నికల సిబ్బంది పోలీస్ బందోబస్తు మధ్య గ్రామాలకు తరలి వెళ్లారు. 59 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో 4 గురు చొప్పున పారామిలిటరీ బలగాలను నియమించారు.

Next Story

Most Viewed