ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి బోనస్ రూ.500 ఇవ్వాలి

by Sridhar Babu |
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి బోనస్ రూ.500 ఇవ్వాలి
X

దిశ, భీంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా పంట కోతకు వచ్చినందున ప్రభుత్వం వెంటనే ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెస్పీ రేటు పై రూ.500 బోనస్ కలిపి వరి ధాన్యంను కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం వేల్పూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. అధికార దాహంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 100 రోజుల గడువు ముగిసిందని ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను, ఆరు గ్యారంటీలను నెరవేర్చాలని, లేని పక్షంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు ఉండదని అన్నారు. ఎద్దు ఏడ్చి ఎవుసము, రైతేడిచిన రాజ్యాం బాగుండదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు పుష్కాలంగా సాగు నీరు, 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతు బీమా ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆడ్డగోలు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో రైతుల పరిస్థితిని దయనీయంగా తయారు చేసిందని ఆయన ఆరోపించారు. 110 రోజుల పాలనలో

కాంగ్రెస్ ప్రభుత్వం సాగు నీరు సరిగా ఇవ్వక, కరెంట్ సరిగా ఇవ్వక కాలిపోతున్న ట్రాన్స్ ఫార్మర్లు, ఎండిపోయిన పంటలు, ఎత్తిపోయిన బోర్ మోటార్లతో రైతులకు కన్నీళ్లే మిగిల్చిందన్నారు. బీఎర్ఎస్ ప్రభుత్వంలో 21 ప్యాకేజీ ట్రైయల్ రన్ ద్వారా కాళేశ్వరం నుండి నీటిని ఇచ్చి ఆదుకుందని గుర్తు చేశారు. సాగునీరు ఇవ్వాలని రైతులు అడిగినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోగా పైపెచ్చు ఎస్సారెస్పీ నుండి ఆలోకేషన్ కంటే ఎక్కువ నీరును కిందికి తరలించి ఇక్కడి రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో చాలా చెక్ డ్యాములు ఉన్నాయని, 21 ప్యాకేజీ ద్వారా నీటితో కప్పల వాగు, పెద్దవాగులు నింపి రైతులను ఆదుకోవాలని రైతు రోడ్డు ఎక్కి అడిగినా ప్రభుత్వం వాగులు నింపలేక పోయిందని అన్నారు. వీటికి స్థానిక కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మానాలని కెసీఆర్ పై అనిచిత వ్యాఖ్యలు సిగ్గు చేటు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ మేరకు, సీఎం స్వయంగా తీసుకొన్న గడువు 100 రోజులు ముగిసినందున వెంటనే రైతులకు ఇచ్చిన 24 గంట కరెంట్, రైతు భరోసా, ఎమ్మెస్పీ ధర పై బోనస్ తో వరి ధాన్యం కొనుగులు, రూ.2 లక్షల రుణ మాఫీ, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో పాటు ఆరు గ్యారంటీలను అమలు చేసి ఓట్లను అడగాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఈ హామీలు, గ్యారంటీలను అమలు చేయాలని, ఎలక్షన్ కోడ్ పేరుచెప్పి తప్పించుకోవద్దని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలుస్తుందని ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సొసైటీ చైర్మన్లు కోర్ కమీటీ సభ్యులు, మండల కమిటీల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story