బాధితులకు అండగా ప్రభుత్వం

by Sridhar Babu |
బాధితులకు అండగా ప్రభుత్వం
X

దిశ, భిక్కనూరు : కుండపోత వర్షాలకు వర్షాలకు సర్వం కోల్పోయి, నిరాశ్రయులైన వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలబడుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో వరద నీటిలో మునిగిన డబుల్ బెడ్ రూం ఇండ్లను అధికారులతో కలిసి పరిశీలించారు. పునరావాస కేంద్రంలో( పాఠశాలలో) ఆశ్రయం పొందుతున్న వరద బాధితులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించడంతోపాటు, అవసరమైన మందులను అందజేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. బాధితులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని రెవెన్యూ, ముఖ్యంగా గ్రామస్తులకు సూచించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులతో కలెక్టర్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూం ఇండ్లను ఎఫ్ టీఎల్ లోపల ఎలా కట్టారని, ప్రతి సంవత్సరం కురిసే వర్షాలకు ఇబ్బందులు తప్పడం లేదా అంటూ గ్రామస్తులను, డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లలోకి వరద నీరు చేరి నిరాశ్రయులైన వారి సమస్యలను తొందర్లోనే పరిష్కరిస్తానన్నారు. అనంతరం గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కన ఉన్న వరద ఉధృతికి కయ్య కోసిన బొబ్బిలి చెరువు కట్టను పరిశీలించి సమస్యను పరిష్కరించాలన్నారు.

గుర్జకుంట దారి నుండి పీతి రాగు వచ్చే వరద కాలువను కొందరు ఆక్రమించడం వల్లే, సిద్ధ రామేశ్వరాలయానికి వెళ్లే దారిలో ఉన్న బీటీ రోడ్డు తెగిపోయిందని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే అక్కడికి వెళ్లి రిపోర్ట్ తయారు చేసి తనకు పంపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులు పీతి రాగు ను పరిశీలించి వెళ్లారు. ఈ కార్యక్రమంలో టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపరి భీంరెడ్డి, తహసీల్దార్ శివ ప్రసాద్, మండల ప్రత్యేక అధికారిని రజిత, ఇంచార్జి ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బల్యాల సుదర్శన్, మాజీ వైస్ ఎంపీపీ తాటిపాముల లింబాద్రి రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు, పీఆర్ అధికారులు, నాయకులు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed