బాన్సువాడ మాత, శిశు ఆసుపత్రికి దేశంలోనే గుర్తింపు : స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి

by Shiva |
బాన్సువాడ మాత, శిశు ఆసుపత్రికి దేశంలోనే గుర్తింపు : స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి
X

జిల్లా మానసిక ఆరోగ్య కేంద్రం మరియు వయోవృద్ధుల ఫిజీయోథెరపీ కేంద్రాలు ప్రారంభం

దిశ బాన్సువాడ : బాన్సువాడ మాత, శిశు ఆసుపత్రికి దేశంలోనే గుర్తింపు లభించిందని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా మానసిక ఆరోగ్య కేంద్రం మరియు వయోవృద్ధుల ఫిజీయోథెరపీ కేంద్రాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రిలో జిల్లా మానసిక ఆరోగ్య కేంద్రం మరియు వయోవృద్ధుల ఫిజీయోథెరపీ కేంద్రాలను ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు.

ఈ ప్రాంతంలోని మానసిక ఆరోగ్య రోగులకు, వృద్ధులకు ఈ కేంద్రాలతో చికిత్స లభిస్తుందన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఆసుపత్రిలో ఉండే స్థాయి సౌకర్యాలు బాన్సువాడలో ఏర్పాటు చేయించామని తెలిపారు. బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రిలో అధునాతన వైద్య పరికరాల ఏర్పాటుతో పాటుగా బ్లడ్ బ్యాంకు, డయాలసిస్ యూనిట్, ఆక్సిజన్ యూనిట్, టిఫా స్కాన్, SNCU , MICU లను ఏర్పాటు చేశామని తెలిపారు. వైద్య సౌకర్యాలతో పాటుగా రోగులకు వారి వెంట వచ్చే సహాయకుల కోసం ఆసుపత్రిలో వసతులు కల్పించామన్నారు.

ఏరియా ఆస్పత్రికి నూతన భవనం నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. రూ.20 కోట్లతో 100 పడకల సామర్ధ్యంతో బాన్సువాడ మాతా-శిశు ఆసుపత్రి నిర్మించామన్నారు. నెలకు 400 లకు పైగా డెలివరీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రారంభించిన రెండు సంవత్సరాల్లోనే తల్లి పాల ప్రోత్సాహం అంశంలో బాన్సువాడ మాతా-శిశు ఆసుపత్రికి జాతీయ అవార్డు వచ్చిందన్నారు. ఈ అవార్డుతో బాన్సువాడ మాత, శిశు ఆసుపత్రికి దేశంలోనే గుర్తింపు వచ్చిందన్నారు.

ఏరియా ఆసుపత్రి మాత, శిశు ఆసుపత్రిని కలుపుతూ ప్రధాన రహదారి మీదుగా రూ.3 కోట్లతో స్టీల్ బ్రిడ్జి నిర్మిస్తున్నామని అన్నారు. అనంతరం రెడ్ క్రాస్ డే సందర్భంగా బ్లడ్ బ్యాంకులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని స్పీకర్ పోచారం, ప్రముఖులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రక్తదానం చేస్తున్న యువకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, డీఎంహెచ్వో లక్ష్మణ్ సింగ్, ఆర్డీవో రాజగౌడ్, డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి, సూపరింటెండెండ్ శ్రీనివాస్ ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, కమిషనర్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.



Next Story