నా ఫోన్ ఎత్తడం లేదు..మంత్రి కోమటిరెడ్డిపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఫైర్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-15 10:00:18.0  )
నా ఫోన్ ఎత్తడం లేదు..మంత్రి కోమటిరెడ్డిపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : నా పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రోడ్లు, బ్రిడ్జిలకు సంబంధించి మాట్లాడేందుకు ఫోన్ చేస్తే రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులపై మంత్రి కోమటిరెడ్డి అధికారులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా నిజామాబాద్ లోక్ సభ పరిధిలో 7 చోట్ల బ్రిడ్జిల నిర్మాణం చేపట్టామన్నారు. రూ.93 కోట్లతో చేపట్టిన మాధవనగర్ ఆర్వోబీ 2 లైన్ ను 4 లైన్ చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు, బిల్లులు సకాలంలో ఇవ్వడం లేదని, కేంద్ర ప్రభుత్వం నిధులు డిపాజిట్ చేసినా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు. రైల్వే రంగాన్ని కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు. జిల్లాకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నా వల్లే జిల్లాలో కాంగ్రెస్ బలహీనపడిందన్నారు. కేసీఆర్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పాలనలో ఆలయాలకు రక్షణ కరువైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధిలో పురోగమిస్తుందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు వేయడం లేదన్నారు. జీహెచ్.ఎం.సి లో 48 సీట్లు గెలిచిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు ఎందుకు గెలవలేదు.? అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం వస్తుందనుకున్న సమయంలో 8 సీట్లకు ఎందుకు పరిమితం అయ్యామని ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయడం లేదు..? బాధ్యులు ఎవరు. ? అని ప్రశ్నించారు. ఈ అంశాలపై బీజేపీ ఆలోచన చేయాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ఎవరిని చెప్పు కింద తొక్కి పెట్టాలో మాకు తెలుసన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కౌన్సిలర్ కూడా గెలవలేని వారు నా గురించి మాట్లాడతారా? అని ఎద్దేవా చేశారు.

Next Story