వేములవాడ సాక్షిగా మోడీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో రివీల్ చేసిన బండి సంజయ్

by Disha Web Desk 19 |
వేములవాడ సాక్షిగా మోడీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో రివీల్ చేసిన బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రశంసల వర్షం కురిపించారు. బుధవారం వేములవాడలో ఏర్పాటు చేసి భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక వేములవాడకు ఇంతవరకు ఏ ప్రధాని రాలేదని.. వేములవాడ రాజన్నను దర్శించుకున్న ఒకే ఒక్క ప్రధాని మోడీ అని కొనియాడారు. అందరిలా మోడీకి ఆస్తిపాస్తులు లేవని, ఆయనకు కుట్రలు, కుతంత్రాలు తెలియవని అన్నారు. మోడీ బ్యాంక్ బ్యాలెన్స్ కేవలం రూ.5లక్షలు మాత్రమేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పదవి వద్దనుకుంటే మోడీ జబ్బకు సంచి వేసుకుని వెళ్లిపోయే రుషి అని అన్నారు. మా మోడీ మేడిన్ భారత్ అని.. మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలిది ఏ దేశామో చెప్పాలన్నారు. మోడీ పక్కా లోకల్.. ఆరడుగుల బుల్లెట్ అని ప్రశంసించారు.

అనంతరం, కాంగ్రెస్ ప్రభుత్వంపై బండి విరచుకుపడ్డారు. బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.. కానీ తెలంగాణ ప్రజలకు ఆ పార్టీ ఇచ్చిందే గాడిద గుడ్డు అని కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర మహిళలకు కాంగ్రెస్ ఇచ్చింది గాడిద గుడ్డు అని ఫైర్ అయ్యారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అని చెప్పి గాడిద గుడ్డే ఇచ్చారని విమర్శించారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసగించిన దొంగల బ్యాచ్ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ దొంగల బ్యాచ్ కావాలో.. అభివృద్ధికి నిదర్శనమైన మోడీ కావాలో తేల్చుకోవాలని పిలుపునిచ్చారు.

Next Story