ముఖ్యమంత్రి మౌనం దేనికి సంకేతం?.. ఎమ్మెల్సీ కవిత సీరియస్

by Gantepaka Srikanth |
ముఖ్యమంత్రి మౌనం దేనికి సంకేతం?.. ఎమ్మెల్సీ కవిత సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘తెలంగాణలో మహిళలపై వరుస నేరాలు, దాడులు, అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నాగర్ కర్నూల్(Nagar Kurnool) జిల్లాలో దేవాలయం వద్ద, హైదరాబాదులో జర్మన్ పర్యాటకురాలిపై జరిగిన అఘాయిత్యాలు ఆవేదన కలిగించాయి. కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేదని తేటతెల్లమవుతున్నది. మహిళలపై వరుస నేరాలు రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని సూచిస్తున్నాయి. రాష్ట్రంలో మహిళలపై 22 శాతం మేర నేరాలు పెరిగాయని అధికారిక గణాంకాలు చెబుతున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ వైఖరి దేనికి సంకేతం?. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే మొద్దు నిద్ర వీడి రాష్ట్రంలో మహిళల భద్రతపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాను’ అని ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కాగా, తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ యువతిపై ఎనిమిది మంది యువకులు సామూహిక అత్యాచారానికి(Gang Rape) పాల్పడ్డారు. ఊర్కొండపేట ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లిన యువతి.. కాలకృత్యాల కోసం గుట్ట ప్రాంతానికి వెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు ఆమెపై దాడి చేశారు. గుట్ట ప్రాంతంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.

Next Story

Most Viewed