గత ఎన్నికల్లోనైనా ఒక సీటు.. ఈ సారి బీజేపీ డకౌటే: మంత్రి హరీష్ రావు

by Satheesh |
గత ఎన్నికల్లోనైనా ఒక సీటు.. ఈ సారి బీజేపీ డకౌటే: మంత్రి హరీష్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్, బీజేపీలు తోడు దొంగలని మంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణలో బీజేపీ నాయకులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని.. తమ సొంత పార్టీ నాయకులకే బీజేపీ మీద నమ్మకం లేదన్నారు. ఈ నెల 26న దుబ్బాకలో జరగనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను సోమవారం మంత్రి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు చెప్పే మాటలన్నీ నీటి మీద రాతలేనని గత ఎన్నికల్లో ఆ పార్టీ ఒక టికెట్ అయినా గెలుచుకోగలిగింది. కానీ ఈసారి డకౌటే అని ఎద్దేవా చేశారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏదైనా ఇచ్చిందా అంటే అది జీఎస్టీనేన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల పేరుతో మోసం చేస్తోందని కర్నాటకలోనూ ఐదు గ్యారెంటీల పేరుతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఊదరగొట్టారని.. ఎన్నికలు పూర్తయ్యాక అటువైపు కూడా చూడటం లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ను నమ్మిన కర్నాటక ప్రజల పరిస్థితి ఉన్న కొండనాలుకకు మందేస్తే ఉన్ననాలుక ఊడినట్లుగా మారిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ పరిస్థితి కూడా అలాగే మారుతుందని హెచ్చరించారు. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోవాలంటే మరోసారి కేసీఆర్‌నే గెలిపించాలన్నారు.



Next Story