Ganesh Immersion: నిమజ్జనం వేళ జాగ్రత్తలు తప్పనిసరి.. పోలీసుల కీలక సూచనలు

by Shiva |   ( Updated:2024-09-16 01:57:15.0  )
Ganesh Immersion: నిమజ్జనం వేళ జాగ్రత్తలు తప్పనిసరి.. పోలీసుల కీలక సూచనలు
X

దిశ, శామీర్‌పేట: గణేష్ ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు అట్టహాసంగా కొనసాగాయి. ఎలాంటి అవరోధాలు లేకుండా నిమజ్జనాలు కొనసాగేలా ఉత్సవ సమితి సభ్యులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు గాను పోలీసులు ముఖ్య సూచనలు చేశారు. నిమజ్జన సమయంలో చెరువుల వద్దకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో గజ ఈతగాళ్లను నియమించాలని సూచించారు. భారీ విగ్రహాలను వాహనంపై ఎక్కించడం కష్టంతో కూడుకున్న పని కావునా చిన్నపాటి క్రేన్లు అందుబాటులో ఉంటే పని సులువు అవుతోందని తెలిపారు.

పోలీసులు సూచనలు ఇలా..

* ప్రతి వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలి.

* విగ్రహాలను పట్టుకోవడం తీర్థ ప్రసాదాల పంపిణీ బాధ్యతలు పిల్లలకు అప్పగించకూడదు.

*వాహనం కుదుపునకు గురైతే కిందపడే ప్రమాదం ఉంది.

* క్రేను సాయంతో విగ్రహాలను నిమజ్జనం చేయాలి.

* ఊరేగింపులో ప్రమాదకర నృత్యాలు చేయకూడదు, మద్యం సేవించరాదు.

* డీజేలకు అతి దగ్గరగా ఉండకూడదు భారీ శబ్ధంతో గుండె లయ తప్పే ప్రమాదం ఉంది.

* మార్గమధ్యలో రహదారికి అడ్డంగా కిందికి వేలాడుతూ ఉండే విద్యుత్ తీగలతో ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

* ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలి.

*అనుకోని ఘటనలు జరుగుతే వెంటనే 100, 108కి కాల్ చేయాలని పోలీసులు కోరుతున్నారు.

అధికారులు తీసుకోవాల్సి జాగ్రత్తలు

* కిందికి వేళాడుతున్న విద్యుత్ తీగలను సవరించి రోడ్డు పక్కన ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలి.

* ఇటీవల కురిసిన వర్షాలకు రహదారులపై గుంతలు ఏర్పడి బురదమయంగా మారాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. రోడ్లపై మట్టి పోసి చదును చేయాలి.

* నిమజ్జనం చేసే చెరువులు కుంటలు వాగులు, మొదలగు వాటి వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి.

* పోలీసుల బందోబస్తుతో పాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉండేలా చూడాలి.

* లోతుగా ఉండే ప్రాంతానికి వెళ్లకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి.

* చిన్నపిల్లలు యువకులను పెద్దలు కనిపెడుతూ ఉండాలి.

Advertisement

Next Story

Most Viewed