మల్లంపేటలో మరో భూ అక్రమ దందా..!

by Aamani |
మల్లంపేటలో మరో భూ  అక్రమ దందా..!
X

దిశ,మేడ్చల్ బ్యూరో : అప్పట్లో ... మేడ్చల్ జిల్లా, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేటలో 65 విల్లాలకు అనుమతులు తీసుకుని ఓ నిర్మాణ సంస్థ ఏకంగా 260 విల్లాలు నిర్మించిన విషయం గుర్తుందా...? చెరువు శిఖం,బఫర్ జోన్ స్థలాలను అక్రమించి ఒకటి, రెండు, కాదు శ్రీనివాస్ లక్ష్మి కన్ స్ట్రక్షన్ అనే సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా ఏకంగా 195 విల్లాలు నిర్మించి తెలుగు రాష్ట్రాలలోనే సంచలనం సృష్టించింది.హైకోర్టు ఆదేశాలతో అప్పట్లో అధికార యంత్రాంగం 208 అక్రమ విల్లాలను గుర్తించి నిషేధిత జాబితాలో చేర్చారు.వీటిలో 100 విల్లాలను సీజ్ చేసింది. మిగతా విల్లాలను కూడా సీజ్ చేసినట్లే భావించాలని హెచ్చరిస్తూ.. నోటీసులు జారీ చేసి హడావిడి చేశారు.ఆ తర్వాత ఎక్కడికి అక్కడ ముడుపులు అందడంతో.. ఆ తర్వాత షరామామూలే..ఆదంతా ఇప్పుడెందుకంటరా..? అదే శ్రీనివాస్ లక్ష్మి కన్ స్ట్రక్షన్ సంస్థ గ్రూప్ ఆఫ్ కన్ స్ట్రక్షన్ పేరిట మరో భారీ భూ అక్రమ దందాకు తెరలేపింది.

సర్కారు స్థలంలో విల్లాల నిర్మాణం..

దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట రెవెన్యూ సర్వేనెంబర్ 170/5 ఎక్ట్సెంట్ చూపుతూ సర్వేనెంబర్ 170/1 లో 2946.07 చదరపు గజాల ప్రభుత్వ భూమిలో శ్రీనివాస్ లక్ష్మి కన్ స్ట్రక్షన్ సంస్థ 17 విల్లాలను నిర్మిస్తోంది. ప్రభుత్వ భూమిలో వైడ్ నంబర్.002095/హెచ్ఎండీఏ/0433/ఎంఈడి/2023 పేరిట 2023, మే 4న 17 విల్లాలకు హెచ్ఎండీఏ అనుమతులు పొందడం చర్చనీయాంశంగా మారింది, ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతుండడంతో ఫిర్యాదులు అందుకున్న రెవెన్యూ అధికారులు 2024, మార్చి మార్చిలో సదరు అక్రమనిర్మాణాలను జెసిబి సహాయంతో కూల్చివేశారు. అంతేకాకుండా జాయింట్ సర్వే నిర్వహించి హెచ్ఎండీఏ అనుమతులు రద్దుచేయాలంటూ 2024,ఏప్రిల్ 15 న దుండిగల్ తహసీల్దార్, హెచ్ఎండీఏ కమిషనర్ కు లేఖ రాశారు. మూడు నెలలు గడుస్తున్నా చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.

తగ్గేదెలే...

2021 లో పంచాయతీ అధికారులను మ్యానేజ్ చేసి ‘విహానా వెంచర్స్ ’ గ్రూప్ ఆఫ్ కన్ స్ట్రక్షన్ పేరిట ఫోర్జరీ సంతకాలతో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో సంస్థ యజమాని గుర్రం విజయలక్ష్మి పై అప్పట్లో పలు కేసులు నమోదయ్యాయి. అయినా విజయలక్ష్మి తీరుమారడంలేదు.గత ఫిబ్రవరి నెలలో కాలనీలోని పార్క్ స్థలాన్ని ఆక్రమించేందుకు జెసిబి సహాయంతో ఆటవస్తులను కూల్చివేసి అడ్డు వచ్చిన మహిళపై దాడులకు దిగడంతో కాలనీ వాసులు దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు,గుర్రం విజయలక్ష్మిపై పలు కేసులు నమోదయ్యాయి,ఇదిలావుంటే తాజాగా రూ. 25 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలంలో తప్పుడు పత్రాలు సృష్టించి 17 విల్లాలకు హెచ్ఎండీఏ లో అనుమతులు పొంది యధేచ్చగా అక్రమనిర్మాణాలు చేపట్టడం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

అక్రమ విల్లాలపై ఫిర్యాదు..

మల్లంపేట సర్వేనెంబర్ 170/1 ప్రభుత్వ భూమిలో సర్వేనెంబర్ 170/5 లలో హెచ్ఎండీఏ అనుమతులు పొంది 17 విల్లాలు నిర్మస్తున్నారంటూ వాటిని రద్దు చేయాలని బీజేపీ నాయకులు హెచ్ఎండీఏ అధికారులకు,మల్కాజిగిరి ఆర్డీవో కి ఫిర్యాదు చేశారు.2021 నుండి 2023 వరకు పత్రిక కథనాల ద్వారా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శ్రీనివాస్ లక్ష్మీ శ్రీనివాస కన్ స్ట్రక్షన్ కు ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న అక్రమ విల్లాలకు హెచ్ఎండీఏ అనుమతులు మంజూరు చేయడమేమిటని బీజేపీ నిజాంపేట అధ్యక్షుడు ఆకుల సతీష్ ప్రశ్నించారు.. రూ. 25 కోట్ల విలువైన సర్కార్ భూమిని ఆక్రమించుకొని కబ్జా చేస్తున్న సదరు నిర్మాణ సంస్థకు,హెచ్ఎండీఏ మున్సిపల్,రెవెన్యూ అధికారుల తీరు విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న విల్లా లపై చర్యలు తీసుకోవాలని, సదరు నిర్మాణ సంస్థ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సతీష్ డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed