సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి : సంగారెడ్డి కలెక్టర్

by Aamani |
సమస్యల సత్వర  పరిష్కారానికి  ప్రజావాణి : సంగారెడ్డి  కలెక్టర్
X

దిశ, సంగారెడ్డి : సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన 55 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఆ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ , మాధురి,డీఆర్ఓ పద్మజ రాణి లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల సమస్యల పరిష్కారంలో మరింత పటిష్టంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని స్పష్టంగా తెలియజేశారు. ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదే నని ఆమె పేర్కొన్నారు. శాఖల వారీగా పెండింగ్ లో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.

ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించబడాలని, ఇంకా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలో సజావుగా క్లియర్ చేయాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో 55 దరఖాస్తులు రాగా రెవెన్యూ శాఖ 35 , మార్కు ఫెడ్ 2, సర్వే ల్యాండ్ రికార్డు 2,పంచాయతీ & పి టి విభాగం 2, పంచాయతీరాజ్ 1, డి ఆర్ డి ఓ 3, పురపాలక సంఘం 6, విద్యాశాఖ 1 ,ఎక్సైజ్ శాఖ 2, రవాణా శాఖ 1, అందాయని తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు ప్రజా సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఫ్రైడే డ్రైడే నిర్వహణ పాఠశాలలు ,వసతిగృహాలు క్రమం తప్పకుండా తనిఖీల నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని అన్నారు . ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు త్వరగా స్పందించి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story