కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దు

by Disha Web Desk 15 |
కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దు
X

దిశ, జగదేవ్ పూర్ : రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సరిపడా సాగునీరు, విద్యుత్ ఉన్నప్పటికీ సరఫరా చేయలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని, ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైపల్యం చెందిందని మెదక్ ఎంపీ అభ్యర్థి పి. వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. జగదేవ్ పూర్ మండలంలోని పీర్లపల్లి మాజీ సర్పంచ్ అంకిల్ల యాదిరెడ్డి జగదేవ్ పూర్ లో ఏర్పాటు చేసిన రుద్ర ట్రేడర్స్ షాప్ ను శుక్రవారం ఎమ్మెల్సీ డా.వంటేరు యాదవ రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ కరువు కాటకాలతో తల్లడిల్లిన తెలంగాణలో గోదావరి జలాలు పారించి తాగు, సాగు నీటి గోస తీర్చిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో నాలుగు మాసాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైపల్యం చెందిందన్నారు.

ఆరు గ్యారంటీలు అమలు చేయక పోగా ఉన్న కరెంటు, నీళ్లు ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లేని లోటు నేడు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గజ్వేల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ముప్పై ఏళ్ల ముందుకుపోయిందని పేర్కొన్నారు. కలెక్టర్ పరిపాలనా అనుభవంతో మీ పనులు సులభంగా పరిష్కారమవుతాయన్నారు. గెలిచిన నెల రోజుల్లో 100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేస్తానన్నారు. ప్రతి నియోజకవర్గంలో యువతీ యువకులకు ఉచితంగా కోచింగ్ కేంద్రాలు, వృత్తి నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేసి జాబ్ మేళా ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఫంక్షన్ హాల్ నిర్మించి నిరుపేదలకు ఉచితంగా అందిస్తామన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల గుణ గుణాలను చూసి ఓట్లెయ్యాలని ఆయన కోరారు. జగదేవ్ పూర్ ప్రజలతో తనకు ఎంతో అనుబంధం ఉందని, ఇక్కడి అభివృద్ధిలో తన భాగస్వామ్యంను గుర్తు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కి ఇచ్చిన మెజారిటీ తనకు ఇవ్వాలని కోరారు.

పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం

అనంతరం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. పార్టీ శ్రేణులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కేసీఆర్ మాదిరిగా గడపగడపకు వెళ్లి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, కాంగ్రెస్ వైఫల్యాలను వివరించాలని కోరారు. అలాగే నిరుపేద యువతీయువకులకు మేలు చేసే విధంగా ఏర్పాటు చేయనున్న 100 కోట్ల ట్రస్టు ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన వివరించారు. కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు కేశిరెడ్డి నర్సింహారెడ్డి, గుండ రంగారెడ్డి, ఎంపీటీసీ కొత్త కవితా శ్రీనివాస్ రెడ్డి, ఎక్బాల్, బట్టు సుధాకర్ రెడ్డి, కుమ్మరి కనకయ్య, పార్టీ కార్తకర్తలు పాల్గొన్నారు.



Next Story