Minister : ఒక రాష్ట్రం ఒక గుర్తింపు కార్డు కోసం వివరాల సేకరణ చేపట్టాలి

by Kavitha |
Minister : ఒక రాష్ట్రం ఒక గుర్తింపు కార్డు కోసం వివరాల సేకరణ చేపట్టాలి
X

దిశ, గద్వాల కలెక్టరేట్: ఒక రాష్ట్రం ఒక గుర్తింపు కార్డు జారీకై పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి నియోజకవర్గం నుంచి ఒక గ్రామ పంచాయతీ, ఒక మున్సిపల్ వార్డులో కుటుంబ సభ్యుల వివరాల సేకరణ చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో కలిసి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు నెంబరు ఇచ్చి కుటుంబంలోని సభ్యులకు వ్యక్తిగత గుర్తింపు నెంబరుతో కార్డు జారీ చేయాల్సి ఉంటుందన్నారు. కుటుంబ సభ్యుల వివరాలు పకడ్బందీగా సేకరించి తప్పులు లేకుండా నిర్ణీత ప్రొఫార్మా లో వివరాలు నమోదు చేయాలన్నారు. అక్టోబర్ 3 నుంచి 8వ తేదీ వరకు వివరాల సేకరణ పూర్తి చేసి అక్టోబర్ 10న నివేదిక పంపించాల్సిందిగా సూచించారు. కుటుంబ సభ్యుల వివరాలు నమోదు ప్రక్రియను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఆర్డీఓ స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని, పైలెట్ ప్రాజెక్టు పూర్తి అయ్యాక రాష్ట్రంలోని ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తికి ఒక గుర్తింపు కార్డు జారీ చేసేందుకు కార్యాచరణ చేపట్టడం జరుగుతుందన్నారు. కుటుంబంలో పెద్ద వయస్సు కలిగిన మహిళను కుటుంబ యజమానిగా గుర్తించాల్సి ఉంటుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ… ప్రతి జిల్లా నుండి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి నివేదికను గురువారం లోపు పంపించాలని ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ పై సమీక్ష నిర్వహిస్తూ, ఇప్పటివరకు 5 శాతం పూర్తి కాలేదని, ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. నిబంధనల మేరకు ఉన్న లేఔట్లు, ప్లాట్లను త్వరగా రెగ్యులరైజ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. సన్న బియ్యం, దొడ్డు బియ్యం కొనుగోలుకు వేరువేరుగా కేంద్రాలను ఏర్పాటు చేసి సన్నబియానికి 5 వందల రూపాయలు అదనంగా అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు, ఆర్డీఓ రామచందర్, డీపీఓ శ్యాంసుందర్, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్స్ రాంచందర్, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.

Next Story