కుష్టు వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

by Naveena |
కుష్టు వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : మహాత్మా గాంధీ ఆశయం మేరకు కుష్ట వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి, అమరవీరుల స్మారక దినోత్సవంలో భాగంగా..గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మహాత్మా గాంధీ ఆశయాల మేరకు కుష్టు బాధితులకు వివక్ష లేకుండా ప్రేమతో సేవ చేయాలని, సమాజంలో వ్యాధిపై అపోహలను తొలగించి అవగాహన పెంచాలని అన్నారు. మహాత్మా గాంధీ ఆశయాలను గౌరవిస్తూ, కుష్టు వ్యాధి బాధితులకు మద్దతుగా, వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయడానికి ప్రతిజ్ఞ గావించారు. సమాజంలో ఎవరైనా చర్మంపై స్పర్శ కోల్పోయి మచ్చలు కలిగి ఉంటే, వాటిని తాకినప్పుడు నొప్పి కలగనప్పుడు దానిని కుష్ఠ వ్యాధిగా నిర్ధారించాలన్నారు. కుష్టు వ్యాధి కారణంగా అంగవైకల్యం ఏర్పడిన వ్యక్తులు ఉంటే, వారిపట్ల శ్రద్ధ వహించి వారికి సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య సంస్థలో పూర్తి చికిత్స తీసుకునేలా సూచనలు అందించాలన్నారు. వ్యాధిగ్రస్తులను సొంత కుటుంబ సభ్యులుగా భావించి, వారికి అవసరమైన సలహాలు అందించి చికిత్సలు అందే విధంగా కృషి చేయాలని తెలిపారు. వారిపట్ల ఎలాంటి వివక్ష చూపరాదని, ఆత్మ గౌరవాన్ని భంగం కలిగించకుండా వారితో ప్రవర్తించాలని కోరారు. కుష్టు వ్యాధి పూర్తిగా నయం చేయదగినదని, సకాలంలో చికిత్స పొందితే అంగవైకల్యాన్ని నివారించవచ్చన్నారు. కుష్టు వ్యాధి పట్ల ప్రజలలో అవగాహన పెంచే విధంగా సందేశాలను విస్తృతంగా ప్రచారం చేస్తానన్నారు. మహాత్మా గాంధీ కలలు కన్న విధంగా భవిష్యత్తులో కుష్టు వ్యాధి రహిత భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, జిల్లా వైద్య అధికారి సిద్ధప్ప, ఏఓ వీరభద్రప్ప, జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed