BRS Party : తూ..తూ.. మంత్రంగా స్వచ్చదనం.. పచ్చదనం కార్యక్రమం..

by Sumithra |
BRS Party : తూ..తూ.. మంత్రంగా స్వచ్చదనం.. పచ్చదనం కార్యక్రమం..
X

దిశ, ఉప్పునుంతల : నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలంలోని పలు గ్రామాల్లో గత ఐదు రోజుల నుంచి జరుగుతున్నా స్వచ్చదనం.. పచ్చదనం అనే కార్యక్రమం తూతూ మంత్రంగా నిర్వహించారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొత్త రవీందర్రావు అన్నారు. దాదాపు వర్షాకాలం మొదలై నెల రోజులు అవుతున్నాగాని ఇప్పటికి కొన్ని గ్రామాలలో బ్లీచింగ్ పౌడర్ గాని, దోమల నివారణ కొరకు ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడం సిగ్గు చేటు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పది రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టిన పనులకు ప్రభుత్వం ముందు జాగ్రత్తగా నిధులు విడుదల చేసి పది రోజుల ప్రణాళిక చేపట్టారన్నారు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం నుండి ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా కొత్తగా వచ్చిన పంచాయతీ సెక్రటరీలకు తలకు మించిన భారం మోపుతూ పనులు చేయించడం వింతగా ఉందన్నాడు. గతంలో ఉన్న కొంతమంది పంచాయతీ సెక్రెటరీలు తమ చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేస్తే ఒక మండలం నుంచి ఇంకొక మండలం బదిలీ చేయడం ద్వారా వారు ఖర్చు పెట్టిన డబ్బులు ఇంతవరకు చెల్లించకపోవడం హేమమైన చర్య అని అన్నారు.

కొన్ని గ్రామాల్లో అక్కడక్కడ రాజకీయ పార్టీ నాయకులు పంచాయతీ సెక్రటరీలకు, గ్రామపంచాయతీ వర్కర్లకు ఆదేశాలు ఇవ్వడం, ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్లు చేసి కార్యక్రమంలో ఎందుకు పాల్గొంటలేరని ఉన్నత అధికారులకు కంప్లైంట్ చేస్తానని బెదిరింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. రాజకీయ పార్టీ నాయకులు గ్రామంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటే మంచిదే కానీ కాకపోతే అన్ని తానై ప్రవర్తించడం ఏమిటి అని గ్రామాల్లో ప్రజలు చర్చించుకుంటున్నారు. గ్రామాల్లో సీసీ రోడ్డు సైడ్ చెత్తాచెదారం పేరుకుపోయి, రోడ్డు మధ్యలోకి పిచ్చి మొక్కలు రావడం ద్వారా వర్షపు నీళ్లు ప్రధాన కూడలిలో నిలువ ఉండి ప్రజలకు ఇబ్బందిగా ఉందంటున్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా చేయాలంటే ఐదు రోజుల ప్రణాళిక సరిపోదని అన్నారు. ప్రతి గ్రామానికి నిధులు విడుదల చేయాలని స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రభుత్వం 10 నుంచి 15 రోజుల పెట్టి గ్రామాలను శుభ్రంగా ఉంచాలని కోరారు. ప్రజలు డెంగీ, మలేరియా వంటి రోగాల బారిన పడకుండా చర్య తీసుకోవాలని, అధికారులు పూర్తి బాధ్యత తీసుకొని గ్రామాలలోని ఏ రాజకీయానికి తావు లేకుండా పనులు నిర్వహించాలని కోరారు.

Advertisement

Next Story