‘గుండెకు గాయమయ్యింది’.. కన్నీళ్లు తెప్పిస్తోన్న ప్రజా యుద్ధ నౌక గద్దర్ చివరి సందేశం

by Satheesh |   ( Updated:2023-08-06 11:47:39.0  )
‘గుండెకు గాయమయ్యింది’.. కన్నీళ్లు తెప్పిస్తోన్న ప్రజా యుద్ధ నౌక గద్దర్ చివరి సందేశం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా యుద్ధనౌక గద్దర్ ఆకస్మికంగా మృతి చెందారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గద్దర్ ఇవాళ తదిశ్వాస విడిచారు. తన పాటలతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో గద్దర్ క్రియాశీలకమైన పాత్ర పోషించారు. తన ఊర్రూతలూగించే పాటలతో ఎంతో మందిని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వైపు నడిచేలా చేశారు. అమ్మా తెలంగాణమా, బండెనక బండి కట్టి, పొడుస్తున్న పొద్దు మీద వంటి పాటలతో ఉద్యమకారుల్లో కసిని రగిల్చారు. తెలంగాణలోని ప్రతి గడపలో గద్దర్ పాట తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి గొంతు ఇవాళ మూగబోవడంతో యావత్ రాష్ట్ర ప్రజలకు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇదిలా ఉండగా.. గద్దర్ మరణంతో ఆయన చివరి సందేశం ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పిస్తోంది.

“గుమ్మడి విఠల్ నా పేరు. గద్దర్ నా పాట పేరు. నా బతుకు సుదీర్ఘ పోరాటం. నా వయస్సు 76 సంవత్సరాలు. నా వెన్నుపూసలో ఇరుక్కున్న తూటా వయస్సు 25 సంవత్సరాలు. నా పేరు జనం గుండెల చప్పుడు. నా గుండె చప్పుడు ఆగిపోలేదు. కానీ ఎందుకో గుండెకు గాయం అయ్యింది. ఈ గాయానికి చికిత్స కోసం బేగంపేటలోని శ్యామకరణ్ రోడ్డులో అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లో చేరాను. జూలై 20 నుండి నేటి వరకు అన్ని రకాల పరీక్షలు, చికిత్సలు తీసుకుంటూ కుదుటపడుతున్నాను.

గుండె చికిత్స నిపుణులు డాక్టర్ దాసరి ప్రసాదరావు, డాక్టర్ డి.శేషగిరిరావు, డాక్టర్ వికాస్, డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ ఎన్. నర్సప్ప (అనెస్థీషియా), డాక్టర్ ప్రఫుల్ చంద్ర నిరంతర పర్యవేక్షణలో వైద్యం అందుతున్నది. గతంలో నాకు డాక్టర్ జీ.సూర్య ప్రకాశ్ గారు, బి. సోమరాజు గారు వైద్యం చేశారు. పూర్తి ఆరోగ్యంతో కోలుకొని తిరిగి మీ మధ్యకు వచ్చి సాంస్కృతిక ఉద్యమం తిరిగి ప్రారంభించి, ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రజల సాక్షిగా మాట ఇస్తున్నాను”.

Advertisement

Next Story

Most Viewed