KTR: అహంకారం అనుకుంటే దానికి నేనేం చేయలేను

by Gantepaka Srikanth |
KTR: అహంకారం అనుకుంటే దానికి నేనేం చేయలేను
X

దిశ, వెబ్‌డెస్క్: తాను నిఖార్సైన తెలంగాణ బిడ్డను, తెలంగాణ ప్రాంతం వాళ్లకు ఉన్న ఆత్మ గౌరవాన్ని అహంకారం అనుకుంటే దానికి నేనేం చేయలేను అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రుణమాఫీపై త్వరలోనే తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. రుణమాఫీ పూర్తయ్యేదాకా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తామని తెలిపారు. గ్రామస్థాయిలో కూడా రుణమాఫీపై పోరాట కార్యక్రమాలను చేపడతాం. తెలంగాణ ఉద్యమ కాలంలో చేసిన అన్ని రకాల నిరసనలు మళ్లీ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతుంది అని అనుకోవడం లేదు. బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. స్థానిక సంస్థలకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్లుగా ఆ పార్టీ పరిస్థితి తయారైంది.

కాంగ్రెస్ పార్టీ చేసిన డిక్లరేషన్‌ల పేరుతో ఏ ప్రాంతాల్లో అయితే సమావేశాలు పెట్టిందో.. అదే ప్రాంతాల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిరసన కార్యక్రమాలు చేస్తాం. ఆరు గ్యారంటీల అమలు పైన కూడా బీఆర్ఎస్ పోరాటాన్ని కొనసాగిస్తుంది. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేదాకా పోరాటం కొనసాగిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరు చెప్పి రైతులను మోసం చేస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పింది నిజం. రైతుల ఖాతాలకు రూ. 7500 కోట్లు మాత్రమే చేరినయ్. అమలు అమలు చేయలేని చేతగానితనంతో సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతుంటే మంత్రులు ఇరుక్కపోతున్నారు. రుణమాఫీ పేరుతో ఎన్నో మీటింగ్‌లు పెట్టి ఇన్ని నెలల తమాషా తర్వాత రైతుబంధు రెండు విడతల్లో రూ. 7500 కోట్లు మాత్రమే ఇచ్చారు. రాష్ట్రం అప్పుల పైన రేవంత్ రెడ్డి సర్కార్ అసత్యాలు, దుష్ప్రచారాలు చేస్తోంది. తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం సీఎం, మంత్రులు అప్పులపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.

కేవలం ప్రజా అంశాల నుంచి దృష్టి మరలించేందుకే సీఎం రేవంత్ రెడ్డి బజారు భాష మాట్లాడుతున్నాడు. రైతు రుణమాఫీ పైన అబద్దాలు చెప్పినందుకు ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య చాలా విభేదాలు ఉన్నాయి. రూ.12,400 కోట్ల మేరకు అదానీతో పెట్టుబడులకు సంబంధించి రేవంత్ రెడ్డి స్వయంగా ఎంఓయూ కుదుర్చుకున్నాడు. అసలు అదానీ మంచివాడా చెడ్డవాడా అనే విషయాన్ని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు కూర్చొని తేల్చుకొని తమ అభిప్రాయం చెప్పాలి. గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడితే ఎంత దరిద్రంగా ఉంటదో.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి లాంటి తెలంగాణ ద్రోహీ పెడితే అంతే దారుణంగా ఉంటుందని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వాళ్లకు ఉన్న ఆత్మ గౌరవాన్ని అహంకారం అనుకుంటే దానికి నేనేం చేయలేను. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీకి బానిసలు. తాము అలాంటి ఒరవడిని ఒప్పుకోమని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed