MLC Madhusudan : కేటీఆర్ ను ఎదుర్కోలేక కాంగ్రెస్ బీజేపీ కలిసి రాజకీయ నాటకాలు

by Aamani |
MLC Madhusudan : కేటీఆర్ ను ఎదుర్కోలేక కాంగ్రెస్ బీజేపీ కలిసి రాజకీయ నాటకాలు
X

దిశ, ఖమ్మం : రాజకీయ ప్రత్యర్థిని దొడ్డిదారిలో దెబ్బకొట్టాలనే దుష్ట బుద్ధి బెడిసికొట్టిందని, మాజీ మంత్రి కేటీఆర్ కు ప్రజల నుంచి వచ్చే మద్దతు చూసి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి కుట్ర రాజకీయ నాటకాలకు తెరలేపారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు (MLC Madhusudan) తాతా మధుసూదన్ విమర్శించారు. సోమవారం ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు... బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయంగా ఎదుర్కోలేక డ్రగ్స్ పేరిట కేటీఆర్, వారి కుటుంబ సభ్యులపై జరుగుతున్న రాజకీయ దాడిని తీవ్రంగా ఖండించారు. రాజకీయ ఎత్తు జిత్తులతో ప్రత్యర్థులపై అప్పర్ హ్యాండ్ సాధించాలని చూడడం రాజకీయాల్లో సర్వసాధారణం.. కానీ దానికి భిన్నంగా ప్రత్యర్థి కుటుంబ సభ్యులను అప్రతిష్ఠ పాలు చేయాలని కుట్ర పన్నడం పరాకాష్టకు చేరిన రాజకీయ దివాలకోరు తనానికి నిదర్శనం అని మండిపడ్డారు.

ప్రజా సమస్యలపై పోరాడుతూ తనను ఇరకాటంలో పెడుతున్న కేటీఆర్ ను రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా ఎదురుకోవడానికి హుందాగా వ్యవహరించడానికి అనేక అవకాశాలు ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఎలాంటి అవినీతి దొరకపోవడంతోనే రేవ్ పార్టీ అని కొత్తగా డ్రామాను సృష్టించారన్నారు. ప్రతికారమే పరమావధిగా తలచే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు కేటీఆర్ ను ఏమీ చేయలేక.. ఆయన బామ్మర్ది, బంధువుల పై ప్రతాపం చూపించారని ఆరోపించారు.‌ ఫామ్ హౌస్ లో 70 ఏళ్ల వయసున్న పెద్దవిడతో పాటు మహిళలు, పిల్లలు,‌ బంధువులు చేసుకున్న దావత్ ను భూతద్దంలో చూపే ప్రయత్నం చేయడం వక్ర బుద్ధికి నిదర్శనం అన్నారు.

కేవలం ఫ్యామిలీ దావత్ అని నిర్దారణ జరిగినంక కూడా రేవంత్ రెడ్డి డైరెక్షన్ తో వారి టీమ్ చిల్లర మల్లర పనులకు దిగారన్నారు. దసరా,దీపావళి వంటి పెద్ద పండుగలప్పుడు దావత్ లు సర్వ సాధారణం..ఇంకా చెప్పాలంటే కొత్త ఇంట్లోకి పోయినప్పుడు కూడా ధూమ్ ధామ్ దావత్ లు జరుపుకోవడం సర్వసాధారణమని, అలాంటి దావత్ ను దారి తప్పిన కల్చర్ తో జరుపుకొన్నారని తప్పుడు సమాచారం మీడియాకు అందించారని తెలిపారు. కొన్ని మీడియా సంస్థలు రోజంతా విషం కక్కారు.. వెర్రి తలల వికృత చేష్టలకు పరాకాష్టగా బ్రేకింగ్ ల మీద బ్రేకింగ్ లు పెడుతూ బీఆర్ఎస్ పార్టీని అవహేళన చేస్తూ నిలబెట్టేందుకు విఫల ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు జతకట్టాయి అనేదానికి నిన్న ఆ రెండు పార్టీల నాయకులు వివరించిన తీరే నిదర్శనమన్నారు. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ తన పదవికి వన్నె తెచ్చే విధంగా వ్యవహరించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ సోషల్ మీడియా వేదికగా డ్రగ్స్ దొరికినట్లు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి గొర్ల పక్క పడ్డారన్నారు. సీఎం కార్యాలయం నుండి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) డైరెక్షన్ నిర్వహిస్తుండడంతో కొందరు పోలీసు ఉన్నతాధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని విమర్శించారు. అధికార పార్టీ వత్తాసు పలుకుతున్న అధికారులు ఇకనైనా మారాలని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతంగా ఉండదు అనేది గుర్తుంచుకోవాలని సూచించారు.

బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతి ఉత్సాహం చూపించిన అధికారులపై తప్పకుండా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.‌ ఈ విలేకరుల సమావేశంలో మాజీ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, సీనియర్ పార్టీ నాయకుడు ఆర్.జె.సి కృష్ణ, బి.రెడ్డి నాగ చందర్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారులు ఉప్పల వెంకటరమణ, లీగల్ సెల్ బిచ్చల తిరుమల రావు, రూరల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు, పగడాల నరేందర్, లింగన్న బోయిన సతీష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story