- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
అమానవీయం..బతికుండగానే శ్మశానానికి..
దిశ, తంగళ్ళపల్లి : ప్రాణం ఉండగానే ఓ వృద్ధురాలిని బంధువులు శ్మశాన వాటికలో తెచ్చి పడేశారు. ఈ అమానవీయ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో జరిగింది. గ్రామానికి చెందిన కూకట్ల రాజవ్వ(75) గతంలో గ్రామ పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేసింది. భర్త కొంతకాలం కిందటే మరణించడం, సంతానం లేకపోవడంతో తన అన్న ఇంట్లో ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో అనారోగ్యంతో మంచం పట్టింది. దీంతో మేనల్లుడు తిరుపతి ఆమెను తీసుకొచ్చి శ్మశానంలో వదిలేసి వెళ్లాడని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపై అతడిని సంప్రదించగా.. రాజవ్వ సోదరి పిల్లలు తాము చూసుకుంటామని తీసుకెళ్లారని, తాజా ఇవాళ తీసుకొచ్చి శ్మశానంలో వదిలేసి వెళ్లారని తెలిపాడు. ఏది ఏమైనా అటు అన్న కుటుంబం, ఇటు సోదరి కుటుంబీకులకు బరువైన రాజవ్వ బతికుండగానే శ్మశానానికి చేరిన ఘటన అందరినీ కలచివేసింది. రోజురోజుకు మానవత్వం కనమరుగవుతోందనడానికి నిదర్శనంగా నిలిచింది.
బంధువులను ఒప్పిస్తున్న పోలీసులు..
స్థానికుల సమాచారంతో శ్మశాన వాటికకు చేరుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీశారు. రాజవ్వ బంధువులతో మాట్లాడి ఆమె బాగోగులు చూసుకునేలా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించే అవకాశం ఉంది.