KTR: ఆ నిర్ణయంతో తెలంగాణ విద్యార్థులే నాన్ లోకల్: కేటీఆర్

by Prasad Jukanti |
KTR: ఆ నిర్ణయంతో తెలంగాణ విద్యార్థులే నాన్ లోకల్: కేటీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లలో స్థానికత గుర్తింపు కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అంశాలు తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేసేలా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జీవో 33 ప్రకారం నిర్దేశించిన స్థానికతలోని అంశాలు ప్రభుత్వం వేలితో విద్యార్థుల కళ్లను పొడిచినట్టు ఉందని ధ్వజమెత్తారు. స్థానిక విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమానాస్పదంగా కనిపిస్తున్నదని, మెడిసిన్ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. మెడికల్ సీట్లలో స్థానికత అంశంపై మంగళవారం కేటీఆర్ ఎక్స్ ప్లాట్ ఫామ్ వేదికగా స్పందించారు.

ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నిబంధన ప్రకారం 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదివి విద్యార్థులే స్థానికులు అవుతారు. ఈ నిర్ణయం ప్రకారం చాలా మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులే తెలంగాణలో లోకల్ అవుతారన్నారు. హైదరాబాద్ లో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఉన్నందున ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చాలా మంది ఇక్కడే విద్యాభ్యాసం చేస్తున్నారు. కొత్త రూల్స్ ప్రకారం వారిలో చాలా మంది తెలంగాణలో లోకల్ అవుతారు. అలాగే 9వ తరగతి వరకు తెలంగాణలోనే చదివి ఆపై విద్యా ఇతర రాష్ట్రాల్లో పూర్తి చేసిన మన రాష్ట్రానికి చెందిన మాత్రం నాన్ లోకల్ గా మారుతారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మన విద్యార్థులు మెడిసిన్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. 2023-24 విద్యాసంవత్సరం వరకు 6వ తరగతి నుంచి 12 తరగతి వరకు నాలుగేళ్లు గరిష్టంగా ఎక్కడ చదివితే అదే స్థానికతగా గుర్తించాం. దాని కారణంగా మన విద్యార్థులు ఇంటర్మీడియేట్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పటికీ వారు లోకల్ గానే పరిగణించబడే వారన్నారు. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న కొత్త నిబంధనల ప్రకారమైతే వేలాది మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో లోకల్ గా పరిగణించబడితే మన విద్యార్థులు నాన్ లోకల్ గా మారే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా... కొత్త రూల్స్ ను వెనక్కి తీసుకుని గతంలో అనుసరించిన విధానాన్నే అనుసరించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed