బీజేపీ వాళ్లకు దమ్ముంటే ముందు ఆ పని చేయండి.. రేణుకా చౌదరి సవాల్

by Disha Web Desk 13 |
బీజేపీ వాళ్లకు దమ్ముంటే ముందు ఆ పని చేయండి.. రేణుకా చౌదరి సవాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఫేక్ వీడియో కేసులో టీ కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి హాట్ కామెంట్స్ చేశారు. ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగారని, ఏ హక్కుతో గాంధీభవన్ కు వచ్చి తమ వాళ్లపై కేసులు పెడుతున్నారని ప్రశ్నించారు. సోమవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన రేణుకా చౌదరి.. బీజేపీ వాళ్లకు దమ్ముంటే ప్రజ్వల్ రేవణ్ణను పట్టుకోవాలని సవాల్ విసిరారు. బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపుల గురించి ప్రజలందరికి తెలిసిందే అని, దేశ ప్రతిష్ట కోసం మెడల్స్ సంపాధిస్తున్న మహిళా రెజ్లర్లను వేధించిన బ్రిజ్ భూషణ్ కు టికెట్ నిరాకరించినట్లే నిరాకరించి దొడ్డిదారిలో మళ్లీ ఆయన కుమారుడికే ఎందుకు టికెట్ ఇచ్చారని ప్రశ్నించారు. ముస్లింల పట్ల ప్రధాన మంత్రి, బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. హిందూ ఆలయాలకు ఎందరో ముస్లింలు విరాళాలు కూడా ఇచ్చారన్నారు. ముస్లింల గురించి మోడీ అహంకారం, అధికార దాహంతో విచ్చలవిడిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ దేశంలో హిందువులకు ఉన్న హక్కులు మిగతా అన్ని వర్గాలకు ఉన్నాయని, నరేంద్ర మోడీ కేవలం హిందువలకు మాత్రమే ప్రధాన మంత్రా? ముస్లింలకు ప్రధాన మంత్రి కాదా? అని నిలదీశారు. మధించిన ఏనుగు మాదిరిగా వ్యవస్థ లన్నింటిని తొక్కివేస్తూంటే చూసి సిగ్గుపడుతున్నామన్నారు. ముస్లిం దేశాల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని, హిందూ ధర్మాన్ని గౌరవించి కోట్లాది రూపాయలు వెచ్చించి తమ దేశాలలో హిందూ దేవాలయాలను నిర్మించి ప్రధాని మోడీని స్వాగతిస్తే ఆయన మాత్రం మీ దేశంలో ముస్లింలను కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. బీజేపీ చర్యలను చూసి ఆ దేశాల్లో ఉండే హిందువులు భయాందోళనలతో గడుపుతున్నారన్నారు. మొదటి ప్రధాని నెహ్రూ దూరదృష్టితో ఆలోచించి ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించి మన వారు విదేశాల్లో సత్తా చాటేలా చేశారన్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యల వల్ల విదేశాల్లో ఉన్న మనవారిపై అక్కడి వారు తిరగబడితే వాళ్లందరు ఏమైపోతారని కూడా ఆలోచించరా? అని ఫైర్ అయ్యారు.

Read More...

సీఎం రేవంత్ రెడ్డిపై.. డీకే అరుణ ఎదురుదాడి

Next Story

Most Viewed