Lanco Hills : ల్యాంకో హిల్స్‌లో కొత్తరాతియుగపు ఆనవాళ్లు!

by Nagaya |
Lanco Hills : ల్యాంకో హిల్స్‌లో కొత్తరాతియుగపు ఆనవాళ్లు!
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని ల్యాంకోహిల్స్‌ సమీపంలో కొత్త రాతియుగపు ఆనవాళ్లు వెలుగు చూశాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌, సీఈవో డా.ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. నగరంలోని అపురూప శిలాకృతు (రాక్‌ఫార్మేషన్‌)ల వద్ద ఆదిమ మానవుని అడుగుజాడల అన్వేషణలో భాగంగా ఆయన, ప్లీచ్‌ ఇండియా బృందంతో కలసి గురువారం ఖాజాగూడ ` ల్యాంకోహిల్స్‌ పరిసరాల్లోని మెహర్‌బాబా ` అనంతపద్మనాభస్వామి కొండపై కొత్త రాతియుగపు మానవులు తమ రాతి గొడ్డళ్లను పదునుపెట్టుకోగా ఏర్పడిన రాతి గ్రూప్స్‌ను గుర్తించినట్లు ఆయన చెప్పారు. పద్మనాభస్వామి ఆలయదారికి అటూ ఇటూ ఉన్న సహజ సిద్ధమైన నాగపడిగెలాంటి రాతి బండల కింద ఆనాటి మానవులు తాత్కాలికంగా నివసించేవారని, ఆ సందర్భంగా రాతి పనిముట్లకు పదును పెట్టుకొనేవారని ఈ రాతి గాళ్లు తెలియజేస్తున్నాయన్నారు.

మెహర్‌ బాబా గుహకు ఎగువన 50 మీటర్ల దూరంలో నాలుగు చోట్ల 30 సెం.మీ. 20 సెం.మీ మధ్య పొడవు, 2 సెం.మీ. వెడల్పు, 2 సెం.మీ. నుంచి 5 సెం.మీ. లోతుగల రాతి గాళ్లున్నాయని వాటి ఆకారం, అరగదీసిన తీరును బట్టి, ఇవి ఖచ్చితంగా, ఇప్పటికి పూర్వం 6000`4000 సం॥ల మధ్య కాలానికి చెందినవని శివనాగిరెడ్డి చెప్పారు. గతంలో సమీపంలోని నార్సింగి`కోకాపేట, జూబ్లీహిల్స్‌ ` బిఎన్‌ఆర్‌ హిల్స్‌లో కొత్తరాతియుగపు ఆనవాళ్లు వెలుగు చూశాయని, ఈ నేపథ్యంలో ఖాజాగూడ కొత్తరాతియుగపు ఆనవాళ్లు హైదరాబాదు నగర పురా చరిత్రకు ఆధారాలవుతాయని, వీటిని కాపాడుకోవాలని ఆలయ యాజమాన్యానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్లీచ్‌ ఇండియా ఆర్కియాలజిస్టులు మైత్రేయి, దుర్గ, నయన్‌, సాక్షి, కిరణ్‌, జితేంద్ర పాల్గొన్నారని ఆయన తెలిపారు.

Next Story

Most Viewed