నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రైతాంగ పోరాటం

by Sridhar Babu |
నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రైతాంగ పోరాటం
X

దిశ, ముషీరాబాద్ : నిజాం నిరంకుశుత్వానికి వ్యతిరేకంగా మట్టి మనుషులే ఉక్కు మనుషులై తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంఎల్ఎ చాడ వెంకట్ రెడ్డి అన్నారు. మహత్తరమైన ఈ పోరాటాన్ని ఫాసిస్టు బీజేపీ హిందూ, ముస్లింల గొడవలుగా చిత్రీకరించేందుకు కుట్ర చేస్తుందని విమర్శించారు. సాయుధ పోరాటానికి మతం రంగు పులిమే వారి ప్రయత్నాలను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సీపీఐ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో మంగళవారం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల ఫొటో ఎగ్జిషన్ ను చాడ వెంకట్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్ర కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఎస్.బోస్, ఈటీ నరసింహ, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, సామాజిక వేత్తలు వినాయక్ రెడ్డి, మోటూరి కృష్ణ ప్రసాద్, సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్. ఛాయాదేవి, సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, బి.స్టాలిన్, తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అనిల్ కుమార్ , ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నిజాం, భూస్వామ్య, పెత్తందారులు, దొరల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందన్నారు. దొరల దౌర్జన్యాలు, దురాచారాలు మితిమిరిపోయాయని చెప్పారు. 1931లో కమ్యూనిస్టు పార్టీ పోరాటాన్ని ప్రారంభించిందని, మట్టి మనుషులే ఉక్కు మనుషులై పోరాటం చేశారని గుర్తు చేశారు. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దూం మొహినుద్దీన్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని తెలిపారు. భూస్వామ్య కుటుంబంలో జన్మించిన రావి నారాయణ రెడ్డి సాయుధ పోరాటంలో ప్రజలను భాగస్వామ్యులను చేయడంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు.

ప్రజారాజ్యం కోసం పోరాటం జరిగిందన్నారు. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న క్రమంలో సర్థార్ వల్లభాయ్ పటేల్ నిజాం లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతూ మహాత్తరమైన సాయుధ పోరాటాన్ని ఎందుకు ఇప్పటి వరకు గుర్తించలేదని ప్రశ్నించారు. కర్నాటక, మహారాష్ట్రలో విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తారని, తెలంగాణలో మాత్రం ఎందుకు నిర్వహించబోరని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని కోరారు. హైదరాబాద్ లో తెలంగాణ సాయుధ పోరాట యోధుల స్మృతి వనంను ఏర్పాటు చేయాలన్నారు.

చరిత్రను వాస్తవాలతో తిరిగి రాస్తాం : కె.శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంపైన రాసిన పుస్తకాలు చూస్తే సిగ్గుపడాల్సి వస్తుందని, పదేళ్ల కాలంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కనుమరుగు చేసేందుకు కుట్ర చేశారని విమర్శించారు. పాఠ్యపుస్తకాలలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర ఎక్కడా కనిపించదని, రావి నారాయణ రెడ్డి పేరు లేదని ప్రశ్నిస్తే, అప్పుడు ఆయన పేరును పొందుపర్చారని తెలిపారు. చరిత్రను వక్రీకరించి రాసిన వారికి కనువిప్పు కలిగేలా వాస్తవాలను తెలియజేస్తూ చరిత్రను తిరిగి రాయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని తామే ప్రారంభిస్తామని శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదని, ఇచ్చిన హామీలు అమలు కాలేదని తెలిపారు.

పోరాట ఫలితంగా భూ పంపిణీ జరిగింది : జస్టీస్ చంద్ర కుమార్

నిజాం జమీదార్లు, జాంగీర్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 4 లక్షల మంది యోధులు అమరులయ్యారని జస్టిస్ చంద్ర కుమార్ తెలిపారు. పోరాటం ఫలితంగా దొరలు గడీలను ఖాళీ చేసి పారిపోయారన్నారు. సాయుధ పోరాట ఫలితంగా పేదలకు 10 లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్లిం గొడవలుగా చిత్రీకరించేందుకు కుట్ర జరుగుతుందని విమర్శించారు.

ఈ పోరాటంలో మగ్దూం మొహినుద్దీన్, షేక్ బదంగీ, సోయాబుల్లాఖాన్ పాల్గొన్నారన్నారు. నిజాం సైన్యానికి రాజకార్లకు ఖాసీం రజ్వీ నాయకత్వం వహిస్తే, నిజాం ఖజానాకు ఇస్నూర్ రాంచంద్రారెడ్డి ఆధీనంలో ఉండేదని అన్నారు. సరైన చరిత్ర కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, నిజమైన చరిత్రను బయటికి తీసుకరావాలని సూచించారు. అమరుల జ్ఞాపకార్థం స్మృతివనం ఏర్పాటు చేయాలని జస్టిస్ చంద్ర కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఏసురత్నం, సీపీఐ రాష్ట్ర నాయకులు చందునాయక్, హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు పడాల నళిని, నెర్లకంటి శ్రీకాంత్, కాంపల్లి శ్రీనివాస్, షంశుద్దీన్, నగర నాయకులు చక్రీభాయ్, మహమూద్, వెంకటయ్య, కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed