హైదరాబాద్‌లో వర్షం ఎఫెక్ట్..అధికారులకు కీలక ఆదేశాలు

by srinivas |
హైదరాబాద్‌లో వర్షం ఎఫెక్ట్..అధికారులకు కీలక ఆదేశాలు
X

దిశ, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో తరచూ కురుస్తున్న వర్షాల కారణంగా దెబ్బతింటున్న రోడ్లపై ఏర్పడుతున్న గుంతలను వెంటనే పూడ్చాలని, వాటి ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. చెరువుల, నాలాల వద్ద భవన నిర్మాణ వ్యర్థాలు(సీఆండ్‌డీ) చెత్త(సాలిడ్ వేస్ట్) ఉండకుండా చూడాలని ఆదేశించారు. శుక్రవారం ఆమె వర్షాకాలం సహాయక చర్యలపై జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..శానిటేషన్ వర్కర్స్ హాజరు ఇంకా మెరుగుపడాలని సూచించారు. డెంగీ కేసుల సమాచారం సకాలంలో పంపించాలని, డెంగీ కేసులు ట్రేస్ ఔట్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.

నిండుతున్న హుస్సేన్ సాగర్..

తరచు కురుస్తున్న వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ క్రమంగా నిండుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుంది. హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా, గరిష్ట స్థాయి నీటిమట్టం 514.75 మీటర్లుగా ఉంది. శుక్రవారం సాయంత్రం వరకు నీటిమట్టం 513.28 మీటర్లకు చేరుకున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.



Next Story