Footpaths : ఫుట్ పాత్ లు కబ్జాలు, ఇబ్బందుల్లో పాదచారులు..

by Sumithra |
Footpaths : ఫుట్ పాత్ లు కబ్జాలు, ఇబ్బందుల్లో పాదచారులు..
X

దిశ, సికింద్రాబాద్ : అనునిత్యం ట్రాఫిక్ రద్దీతో కనిపించే నగరంలో పాదాచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ లు వ్యాపార కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి. అనేక వ్యాపార సముదాయాలకు అడ్డాగా మారి కబ్జా కోరల్లో చిక్కుకుపోయాయి. ప్రజలు నడవడానికి కూడా వీలు లేనంతగా మారిపోయాయి. అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తుండడంతో ఫుట్ పాత్ ల మీద వ్యాపారం చేసుకునే వారికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రజాసౌకర్యార్ధం కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఫుట్ పాత్ లు చిరువ్యాపారులకు కేంద్రంగా మారడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫుట్ పాత్ లు కబ్జా, ఇబ్బందుల్లో పాదచారులు..

మెట్టుగూడ నుంచి ఉప్పల్ వైపు వెళ్లే ప్రధాన రహదారిలో, తార్నాక నుండి మౌలాలి వైపు వెళ్లే ప్రధాన రహదారి ఇరువైపులా ఉన్న ఫుట్ పాత్ ను కబ్జాచేసి కొంతమంది వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అసలే రద్దీగా ఉండే ఈ ప్రధాన రహదారుల్లో నడక దారిన వెళ్లే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఫుట్ పాతుల పై వ్యాపారా డబ్బాలు, దుకాణాలు ఉండడంతో నడకదారిన వచ్చేవారు రోడ్డు మీద నుండే నడవాల్సి వస్తుంది. రయ్యిమని దూసుకొచ్చే వాహనాల పక్కన భయపడుతూ నడక సాగుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకునే వాళ్ళు లేకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. సికింద్రాబాద్ జీహెచ్ఏంసీ అధికారుల పట్ల ఆరోపనలు సైతం వెల్లివిరుస్తున్నాయి.

సైకిల్ ట్రాక్ లు సైతం ఆక్రమణ..

జీహెచ్ఎంసీ నూతనంగా కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన సైకిల్ ట్రాక్ లు సైతం కబ్జా కోరల్లోనే మునిగిపోయాయి. ఫుట్ పాత్ కు ఆనుకొని సైకిల్ ట్రాక్ లు నిర్మించడంతో ఫుట్ పాత్ కబ్జా దారులు మరో అడుగు ముందుకు వేసి ట్రాక్ లో సైతం తమ వ్యాపారాలు పొడగిస్తున్నారు. అటు ఫుట్ పాత్, ఇటు సైకిల్ ట్రాక్ లు కబ్జా కావడంతో నడిచే వారికి దేవుడే దిక్కు అన్నచందంగా ఉంది పరిస్థితి.

పార్కింగ్ స్థావరంగా ఫుట్ పాత్ లు..

కొంతమంది తమ షాపుముందు ఉన్న ఫుట్ పాత్ ను ఆక్రమించి డబ్బాలు ఏర్పాటు చేసి కిరాయికి నడిపిస్తుంటే మరో పక్క యదేచ్చగా పార్కింగ్ స్థావరంగా ఏర్పాటు చేసుకొని వ్యక్తిగత సెక్యూరిటీని ఏర్పాటు చేసుకొని మరీ వ్యాపారులు సాగిస్తున్నారు. తార్నాకలోని కొన్ని హోటల్ యాజమాన్యం ఇదే ట్రెండ్ ఫాలో అవుతుంది. నడిచేవారికి దారి లేకుండా చేస్తున్న వారికే అధికారులు వత్తాసు పలుకుతుండడంతో పదాచారాలుకు తిప్పలు తప్పడం లేదు.

తూతూ మంత్రంగా అధికారులు స్పందన..

ఫిర్యాదులు అందితే తప్ప స్పందించని సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ అధికారులు తమ ఉనికి కోసం చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్భాటం చేసి చేతులు దులుపుకుంటున్నారు. పరిస్థితి మరుసటి రోజు మళ్ళీ అలాగే ఉంటుంది. తార్నాక నుంచి లాలాపేట వెళ్లే మార్గంలో ఉన్న ఓ హొటల్ వాళ్ళు ఫుట్ పాత్ ను కబ్జా చేసి పార్కింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఫిర్యాదు వచ్చిందని సికింద్రాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఫుట్ పాత్ ను కూల్చివేసి చేతులు దులుపుకున్నారు. మరుసటి రోజు అందమైన రంగులతో పార్కింగ్ ట్రాక్ నిర్మించుకొని యథేచ్చగా వ్యాపారం కొనసాగిస్తున్నారు. తార్నాక నుండి ఉప్పల వెళ్లే మార్గంలో ఇదే పరిస్థితి.

తప్పని ట్రాఫిక్ తిప్పలు, చాలన్ల కష్టాలు...

ఫుట్ పాత్ కబ్జాల కారణంగా ప్రజలకి ట్రాఫిక్ తిప్పలు, చలాన్ల కష్టాలు తప్పడం లేదు. అసలే ఫుట్ పాత్ కబ్జాలు అందులో పార్కింగ్ లేని హోటళ్ళ కారణంగా తార్నాకలో నిత్యం ట్రాఫిక్ సమస్య కొనసాగుతుంది. హోటళ్ళకు వచ్చే వారు తమ వాహనాలను రోడ్డు మీదనే పార్కింగ్ చేయాల్సి వస్తుంది. దీంతో ట్రాఫిక్ సమస్య ఇబ్బందిగా మారుతుంది. పార్కింగ్ లేని హోటళ్ళ మీద అధికారులు, ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోరు కానీ వాహనదారుల మీద చలాన్లను వేస్తున్నారు. అసలే ప్రధాన రహదారి కావడంతో రోడ్డు పై వెళ్లే వాహనదారులకు చాలా ఇబ్బందిగా మారుతుంది. ఇక పాదచారుల కష్టాలు దేవుడికే తెలుసు అన్నట్టు ఉంది.



Next Story