కేటీఆర్ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు

by Y.Nagarani |   ( Updated:2024-10-21 07:12:41.0  )
కేటీఆర్ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఇంటివద్ద పోలీసులు భారీగా మోహరించారు. బంజారాహిల్స్ నందినగర్ లో ఉన్న ఆయన నివాసం వద్దకు పోలీసు బలగాలు చేరుకున్నాయి. నేటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానుండగా.. అభ్యర్థులు ఆందోళన చేపట్టనున్న నేపథ్యంలో పోలీసులు ముందుగానే ఆయన ఇంటి వద్ద మోహరించారు. గ్రూప్-1 అభ్యర్థుల్ని కలిసి మళ్లీ ఆందోళనలు చేస్తారన్న అనుమానంతో పోలీసులు ముందుజాగ్రత్తగా బందోబస్త్ చేపట్టారు. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతల ఇళ్ల వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు.

జీఓ 29ను రద్దు చేయాలని అభ్యర్థులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మెరిట్ అభ్యర్థులకే రిజర్వేషన్లను వర్తింప జేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. హైకోర్టు కూడా పరీక్షలు యథావిధిగా జరుగుతాయని చెప్పడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్షలు ప్రారంభం కానుండగా.. సుప్రీం తీర్పుపై సర్వతా ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed